కొత్త జిల్లాల ఏర్పాటుపై గవర్నర్ బిశ్వభూషణ్: ఇదీ క్లారిటీ: గణతంత్ర వేడుకల ప్రసంగంలో
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.
Recommended Video
కొన్నింటికి కొత్త పేర్లు..
కొత్తగా ఆవిర్భవించబోతోన్న 13 జిల్లాల్లో కొన్నింటికి.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్. రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేసింది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీవారి పేరును పెట్టింది. శ్రీబాలాజీ జిల్లాగా పిలవనుంది. విజయవాడ జిల్లా ఎన్టీఆర్ పేరును పెట్టిందీ జగన్ సర్కార్.
కొత్త జిల్లాల ఏర్పాటుపై..
రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ వేడుకల్లో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో హామీ..
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కొత్త జిల్లాలను ప్రస్తావించారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గిరిజనుల కోసం రెండు జిల్లాలను రూపొందించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచిందని బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తు చేశారు.
నవరత్నాల గురించి..
మేనిఫెస్టోలో పొందుపర్చిన 95 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచిందని, పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్న పథకాల గురించి గవర్నర్ ప్రస్తావించారు. రైతు భరోసా కింద 13,500 కోట్ల రూపాయల సహాయాన్ని అందించామని, రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పామని ఇవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
ఆంగ్లంలో విద్యాబోధన..
మనబడి నాడు-నేడు కింద కొత్తగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చగలిగామని చెప్పారు. దీనికోసం వేల కోట్ల రూపాయలను వ్యయం చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధిస్తున్నామని, గ్రామీణ స్థాయిలో ప్రతి పేద విద్యార్థి కూడా అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లోనూ పోటీ పడాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
డ్రాపౌట్స్ను తగ్గించడానికి, పేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపించడాన్ని ప్రోత్సహించడానికి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాల ద్వారా విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం లభిస్తుందని వివరించారు.