ఏపీ వల్ల హైకోర్టులో మనం ఎంత నష్టపోతున్నామంటే: రిటైర్డ్ తెలంగాణ జడ్జి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: న్యాయవ్యవస్థలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ జడ్జిల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ జడ్జి రవీందర్ రెడ్డి మరోసారి తెరపైకి తెచ్చారు. ఏపీ న్యాయమూర్తుల నియామకానికి వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. గురువారం ఉప్పల్లో జరిగిన తెలంగాణ న్యాయాధికారుల సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వరప్రసాద్, మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డిలు మాట్లాడారు.
హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. వచ్చే జనవరి 1న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు విభజన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రా న్యాయవాదులు హైకోర్టు జడ్జిలుగా ఉన్నారని చెప్పారు. వారిని తొలగిస్తేనే తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
ఎనిమిది పోస్టుల్లో ఒక్కరే మనవాళ్లు
హైకోర్టులో తెలంగాణలో ఎనిమిది పోస్టులు రావాలని, కానీ ఒక్కరే మనవాళ్లు ఉన్నారని చెప్పారు. సీనియర్ న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఏడుగురు ఏపీ న్యాయమూర్తులను తెలంగాణ న్యాయమూర్తులుగా ఎంపిక చేయడం బాధాకరమన్నారు. ఇది అమలయితే 2032 వరకు తెలంగాణ న్యాయమూర్తులు ఒక్కరు కూడా ఎంపిక కారన్నారు.
అందువల్లే మనకు అన్యాయం
హైకోర్టులో మెజార్టీస్థాయిలో తెలంగాణ న్యాయమూర్తులు ఉండాలని చెప్పారు. 1956లో ఏపీ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టుకు షిఫ్ట్ అయిందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. ఇప్పటి వరకు హైకోర్టు విభజన జరగలేదని, అందువల్లే తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం జరిగిందన్నారు.
ఈ కారణంగా హైకోర్టు విభజన జరుగుతోంది
2016లో తెలంగాణ, ఏపీ న్యాయమూర్తుల విభజన జరిగిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు విభజన హామీలు ఇచ్చాయని చెప్పారు. ఈ కారణంగా 1 జనవరి 2019 నాటికి ఆంధ్ర, తెలంగాణ హైకోర్టుల విభజన జరుగుతోందని చెప్పారు. తెలంగాణ హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ వారినే జడ్జిలుగా నియమించాలన్నారు. ఉమ్మడి ఏపీలో ఎక్కువగా నష్టపోయిన విభాగం న్యాయవిభాగమే అన్నారు.
ఆ ఇద్దరి పైనే ఏసీబీ దాడులు
ఏపీకి చెందిన న్యాయమూర్తులు హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు ఉన్నారని, వారిని తొలగిస్తేనే తెలంగాణ న్యాయమూర్తులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ బలహీన, దళిత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఇద్దరి పైనే ఏసీపీ దాడులు జరిగాయన్నారు. ఏసీబీ దాడులు కాకుండా, విచారించి తగిన శిక్షలు విధించాలన్నారు.