తెలంగాణలో తాగుబోతుల పాలన: రేవంత్; కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్
సూర్యాపేట : రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికిని దెబ్బ తీయడానికే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల వ్యూహాం పన్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో తాగుబోతుల పాలన నడుస్తుందని అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. శుక్రవారం సూర్యాపేట జిల్లా పరిధిలోని మల్లారెడ్డిగూడెం మండలం వజినేపల్లిలో మాజీ సర్పంచ్, టీడీపీ నేత జ్ఞానానందం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్.
కాగా, శుక్రవారం ఉదయం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు రేవంత్. అనంతరం విగ్రహావిష్కరణలో పాల్గొన్న సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతుల రుణమాఫీ నిధులు కూడా తక్షణం విడుదల చేయాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు దళితుల మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వెంటనే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ద్రోహులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందంటూ దుయ్యబట్టారు రేవంత్.
కేసీఆర్కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లా నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన నేతలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఒకవేళ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే.. తాను 2019 ఎన్నికలకు దూరంగా ఉండిపోతానని సవాల్ విసిరారు కోమటిరెడ్డి.
మిగతా నేతల్లాగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. కేసీఆర్ కూడా గజ్వేల్ లో ఓటమిపాలవుతారన్నారు కోమటిరెడ్డి. రుణమాఫీ చేయనందుకా? లేక ఆరోగ్య శ్రీని పట్టించుకోనందుకా? అసలు కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారాయన.