అవి వెంట్రుకను కూడా పీకలేవు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి
మెదక్/న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తనపై తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు వెంట్రుక కూడా పీకలేవన్నారు. తెరాస పెట్టించే అక్రమ కేసులకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరన్నారు.
అవినీతి పైన బహిరంగ విచారణకు సిద్ధమా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. మెదక్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజీపీ నేతలు బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు.
నందిగామలో రఘువీరా
నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. నందిగామ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బాబూరావు తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం నందిగామ వచ్చిన రఘువీరా, అక్కడ ఏర్పాటు చేసిన రైతు, డ్వాక్రా మహిళల సదస్సులో ప్రసంగించారు.
ఎన్నికల సందర్భంగా పంట రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత హామీల అమలును అటకెక్కించారని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే, ఏం జరుగుతుందన్న విషయాన్ని చంద్రబాబుకు ఉప ఎన్నికల్లో నందిగామ ఓటర్లు రుచి చూపించాలని ఆయన కోరారు.
స్మృతి ఇరానీతో కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతకుముందు కేసీఆర్ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు.