కేసీఆర్పై వ్యాఖ్యలు: వారే రావాలి, రేవంత్ రెడ్డికి కోర్టులో ఊరట
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోర్టులో రేవంత్ రెడ్డి పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి హైకర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్ర రావు మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా రేవంత్ వ్యాఖ్యలు చేశారని, ఈ అంశంపై కేసు నమోదు చేయాలని కోరుతూ న్యాయవాది గోవర్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఈ వ్యవహారంపై పోలీసులు ఉద్దేశ్యంతో, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తనపై కేసు నమోదు చేశారని పేర్కొంటూ రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తాజా విచారణలో పిటిషనర్ వ్యాఖ్యల వల్ల ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వారే కోర్టును ఆశ్రయించాలన్నారు. మూడో వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వీల్లేదన్నారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసులో తదుపరి చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ పర్యటించాలని కోరిన వీహెచ్
తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటించారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు మంగళవారం కోరారు.