టీలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు: సీఎం పోస్ట్పై రేవంత్ రెడ్డి గురి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే 2019 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనని గత కొన్నేళ్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పర్యటిస్తున్న సమయాల్లో అదే చెబుతున్నారు.
తెలంగాణలో 2019లో అధికారం తమదేనని చెబుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన తెరాసతో ఢీ అంటే ఢీ అంటున్నారు. సీఎం కేసీఆర్తో ఎందులోను తగ్గడం లేదు. అలాంటి రేవంత్... పలు అంశాల్లో కుండబద్దలు కొట్టారు. తెలంగాణ సీఎం అభ్యర్థిని తానే అని చెబుతున్నారు. తెలంగాణలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు ఉందని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
2019లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని ఆ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారన్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావుకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని, కాబట్టి తెరాసకు ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారని, అయినా రామచంద్ర రావుకే ఓటు వేశారన్నారు. దీనిని బట్టి చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారని తెలుస్తోందన్నారు.
తనకు పదవులు కావాలని తెరాసలో ఉన్నప్పుడే చెప్పానని అన్నారు. తనకు పదవి ఇచ్చి ఉంటే తెరాసలోనే ఉండేవాడినని చెప్పారు. తనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. తాను పార్టీ వీడే పరిస్థితి రాదన్నారు. తనతో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారే వెళ్తారని చెప్పారు.
తనకు ఇప్పుడు నలభైకి అటు ఇటు వయస్సు ఉందని, మరెన్నోళ్లో రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పారు. తెలంగాణలో రెడ్డి - వెలమ కులాల మధ్య ఆధిపత్యం ఉందన్నారు. కుల రాజకీయ ప్రభావం ఉన్నప్పుడు కులాన్ని విస్మరించలేమని చెప్పారు.
తెలంగాణలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు ఉందని చెప్పడం ద్వారా ఆయన, దానిని ఆసరాగా చేసుకొని టీడీపీలో పైమెట్టు ఎక్కాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీలో విభేదాలు లేవని చెప్పారు. తాను పార్టీ వీడే పరిస్థితి రాదని చెప్పిన రేవంత్.. ఎవరికైనా తనతో ఇబ్బంది ఉంటే వారే వెళ్తారని చెప్పడం గమనార్హం.