టీ ప్రభుత్వానికి అధికారం లేదు, ఏ1 స్టీపెన్ సన్: యనమల ట్విస్ట్
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం అత్యంత హేయమైన చర్య అని, చట్టవిరుద్ధ చర్యలకు పరాకాష్ట అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమైనదని, లంచం తీసుకున్న వ్యక్తి ఇందులో ఏ 1 ముద్దాయి అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉన్నంత మాత్రాన వారి ఫోన్లను ట్యాప్ చేసేందుకు వీల్లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన పోలీసు పరిధి వేరుగా ఉందన్నారు.
తెలంగాణ ఏసీబీ పరిధి కూడా ఆ రాష్ట్రానికే పరిమితం అన్నారు. తమ పరిధి కాని ప్రాంతంలో తెలంగాణ అధికారులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. టెలిగ్రాఫిక్ చట్టాల ప్రకారం టెలిఫోన్ సంభాషణలు వినాలంటే కేంద్ర హోంశాఖ మంత్రి అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే ట్యాపింగ్ చేసే అధికారం లేదన్నారు.
అవినీతి వ్యతిరేక చట్టం ప్రకారం లంచం తీసుకున్న వ్యక్తి మొదటి ముద్దాయి అని, స్టీపెన్ సన్ను ఏ1గా చేర్చాలన్నారు. రేవంత్ రెడ్డిని ఏ1గా పేర్కొనడం నేరపూరిత కుట్ర అన్నారు. రేవంత్ను బలి చేయాలని చూస్తున్నారన్నారు.
కుట్ర రచించిన వారు, పథకం పన్నినవారు, కుట్రలో రేవంత్ను ఇరికించిన వారు, కెమెరాలు అమర్చి రికార్డింగ్ చేయించిన వారు అందర్నీ విచారణ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. రజత్ ప్రసాద్ వర్సెస్ సీబీఐ కేసులో క్రిినల్ అప్పీల్ 748/2010లో సుప్రీం న్యాయమూర్తి పీ సదాశివం ఇచ్చిన తీర్పులో.. నిఘా వ్యవస్థలు చేసే శూలశోధనలను సాక్ష్యంగా తీసుకోలేమని స్పష్టంగా చెప్పిందన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని ఏపీ మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవలసిన వ్యవహారాన్ని ఏసీబీ, పోలీసుల ద్వారా నడిపించడమేమిటని ప్రశ్నించారు.
తెరాసకు ఉన్న సంఖ్య కంటే మండలి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఎలా ఎక్కువగా వచ్చాయో చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిరపరాధిగా బయటకు వస్తారన్నారు.