గజ్వెల్: కెసిఆర్ను ఎదుర్కోగలరా? మామ కోసం హరీష్
మెదక్: జిల్లాలోని గజ్వెల్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెసిఆర్ గజ్వెల్ నుండి అసెంబ్లీకి, మెదక్ నుండి పార్లమెంటుకు పోటీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఆయన రెండు స్థానాల నుండి.. అదీ అసెంబ్లీకి, పార్లమెంటకు పోటీ చేస్తుండటం విపక్షాలకు అస్త్రంగా మారింది. గజ్వెల్ నియోజకవర్గంలో ఎప్పుడు కాంగ్రెసు, టిడిపిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది.
ఈసారి మాత్రం తెరాస తరఫున కెసిఆర్ నిలబడినందున ఏకపక్షమని తెరాస ధీమాతో ఉంది. అయితే గజ్వెల్లో తెరాసకు బలం అంతంత మాత్రమేననే వాదన ఉంది. దీనిని తెరాస కొట్టిపారేస్తోంది. ఈ నెల 18వ తేదీన గజ్వేల్లో భారీ బహిరంగ సభను నిర్వహించిన కెసిఆర్ ప్రజలకు తెలంగాణవాదం సంకేతాలను పంపించారు.
మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, టిడిపిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతూ వస్తోంది. ఈసారి కెసిఆర్ పోటీలో ఉండటంతో టిడిపి, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు అప్రమత్తమయ్యారు. 2004 సంవత్సరం నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ రెండు పర్యాయాలు పొత్తులతో పోటీకి దిగడంతో గజ్వేల్ నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం రాలేదు.

తాజాగా ఒంటరి పోరాటానికి దిగడంతో పార్టీ క్యాడర్ను పెంచేందుకు నాయకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. గజ్వేల్ మండలంలోని ఇతర పార్టీల నాయకులను తెరాసలో చేర్పించుకుంటున్నారు. పలువురు టిడిపి నేతలు తెరాసలో చేరారు. దీంతో ఆ సాన్నిహిత్యం కలిసి వస్తుందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో మంచి ప్రజాధరణ ఉండగా, పదేళ్ల పాటు ఏకపక్షంగా కాంగ్రెస్ పాలన కొనసాగడంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. టిడిపి తరఫున ప్రతాప్ రెడ్డి పదేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన ప్రతాప్ రెడ్డికి ప్రజల్లో కొంతమేరకు సానుభూతి కనిపిస్తోంది. ఆ సానుభూతిని ఆయుధంగా మార్చుకుని ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు.
కెసిఆర్ పార్టీని తెలంగాణలో గెలిపించేందుకు పది జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మామ కెసిఆర్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను హరీష్ రావు భుజాన వేసుకున్నారు. గజ్వెల్తో పాటు మెదక్ పార్లమెంటు స్థానంలో కెసిఆర్ బాధ్యతలను హరీష్ తీసుకున్నారు. ఇక టిడిపి, కాంగ్రెసు అభ్యర్థులు స్వయంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తనదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications