పెద్దపల్లి: వివేక్తో విద్యార్థి నేత ఢీ, కేడర్పై శరత్ బాబు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జి వివేక్, తెలుగుదేశం పార్టీ తరఫున సింగరేణి డాక్టర్ శరత్ బాబు, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఓయు జెఏసి నేత బాల్క సుమన్ బరిలో ఉన్నారు. పెద్దపల్లిలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ వివేక్ వైపు ఎక్కువ మొగ్గు ఉందని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జి వివేక్ కుటుంబం కాంగ్రెసు కుటుంబం. అయితే, తెలంగాణ ఇవ్వడం లేదని ఆయన కొద్ది రోజుల క్రితం తెరాసలో చేరారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చాక తిరిగి సొంతగూటికి వచ్చారు. పెద్దపల్లిలో ఎక్కువసార్లు కాంగ్రెసు పార్టీయే గెలిచింది. టిడిపి నాలుగుసార్లు గెలుపొందింది. నాటి టిడిపి నేత సుగుణ కుమారి రెండుసార్లు విజయం సాధించారు. కాంగ్రెసు నేత కాకా తనయుడిగా వివేక్ పెద్దపల్లి నుండి 2009లో పోటీ చేసి విజయం సాధించారు.

మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ నియోజకవర్గ పరిధిలో తనకున్న సంబంధాలతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో ఉన్న విబేధాలను కూడా తొలగించుకొని సమష్టిగా ప్రచారంలోకి దిగుతున్నారు. హామీ మేరకు సోనియా తెలంగాణ ఇచ్చిందని, కాంగ్రెసును గెలిపించి ఆమెకు బహుమతిగా ఇద్దామని వివేక్ చెబుతూ దూసుకెళ్తున్నారు. తెరాస విద్యార్థి విభాగంలో బాల్క సుమన్ కీలక పాత్ర పోషించారు.
తొలుత చొప్పదండి నుండి పోటీ చేయాలని భావించారు. వివేక్ కాంగ్రెసులో చేరడంతో పెద్దపల్లి లోకసభకు మారారు. విద్యార్థి, యువతలో తనకున్న పరిచయాలు, సంబంధాలతో పాటు తెరాస ద్వారానే తెలంగాణ ఏర్పడిందనే వాదనతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాసకు పట్టు ఉండటం బాల్కకు కలిసి వచ్చే అంశం.
టిడిపి అభ్యర్థి శరత్ బాబు సింగరేణికి చెందిన రామకృష్ణాపూర్ ఆసుపత్రిలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా పని చేస్తూ కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. టిడిపికి మంచి కేడర్ ఉంది. అదే సమయంలో బిజెపితో పొత్తు కలిసి వస్తుందని శరత్ బాబు ధీమాగా ఉన్నారు. ప్రజలతో తనకున్న సత్సంబంధాలు గెలిపిస్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications