రోడ్డు ప్రమాదం: ట్రాఫిక్లో చిక్కుకున్న కెసిఆర్
హైదరాబాద్: విజయవాడ, హైదరాబాద్ జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా గురువారంనాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. రోడ్డు ప్రమాదంతో విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారి ఇరువైపులా దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్వాయ్ కొద్దిసేపు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది.
ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారం రావడంతో వనస్థలిపురం ఏసీపీ ఆనంద్భాస్కర్తో పాటు సీఐ వెంకటేశ్వర్లు ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. సీఎం వస్తుండటంతో పోలీసులు ప్రమాదం జరిగిన లారీల గురించి వదిలి ట్రాఫిక్ క్రమబద్దీకరించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన పోలీసులు రెండు వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.
విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్మెట్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ మృతిచెందాడు. ఇనుపరాడ్లు, ఆపైన ఓ గ్యాస్ ట్యాంకర్ వేసుకుని నగరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ అబ్దుల్లాపూర్మెట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్ను ఢీకొంది. దీంతో లారీ పైన ఉన్న ఇనుపరాడ్లతో పాటు గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్లోకి దూసుకొచ్చింది. ఇనుపరాడ్లు క్లీనర్కు గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
లారీపైన ఉన్న గ్యాస్ ట్యాంకర్ కూడా క్యాబిన్ పైకి దూసుకు రావడంతో టిప్పర్, లారీకి మధ్య క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. క్యాబిన్లో ఉన్న డ్రైవర్ వాటి మధ్య ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలని ఆర్తనాదాలు చేశాడు. దాదాపు అరగంటకు పైగా డ్రైవర్ వాటి మధ్య ఇరుక్కుని మృత్యువుతో పోరాడాడు. క్రేన్ల సాయంతో లారీ, టిప్పర్ను పక్కకు జరిపి డ్రైవర్ను బయటకు తీసి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ గుంటూరు జిల్లా నర్సరావుపేట్కు చెందిన దుర్గారావు (38)గా ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. క్లీనర్ వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.