ఆస్ట్రేలియాలో మంత్రి రోజా : ప్రవాసాంధ్రుల మధ్య - అక్కడా తీరు మారలేదు...!!
ఏపీ మంత్రి రోజా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రవాసాంధ్రుల సమావేశానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన వారి ఆహ్వానం మేరకు రోజా అక్కడకు వెళ్లారు, స్థానికంగా ప్రవసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భర్త సెల్వమణి.. పార్టీ నేత..మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డితో కలిసి హాజరయ్యారు. భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా.. ప్రతీ సందర్భంలో నూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు..పవన్ కళ్యాణ్..లోకేశ్ పైన విరుచుకుపడతారు.
అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించటంలో ముందుంటారు. ఇప్పుడు..ఆస్ట్రేలియాలోనూ జగన్ పైన ప్రశంసలు.. పంచ్ ల విషయంలో ఏ మాత్రం తీరు మారలేదు. అక్కడ వైసీపీ అభిమానులు కోరుకున్న విధంగా పంచ్ లతో ప్రసంగించారు. పేగు పంచిన విజయమ్మ, రక్తం పంచిన రాజన్న, పురుడు పోసిన పులివెందుల, పట్టం కట్టిన ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా జగనన్న పాలిస్తున్నారు అన్నారు. దేశం కోసం యుద్ధం చేస్తే అతను సైనికుడు అని.. ధర్మం కోసం యుద్ధం చేస్తే అతను రాముడని.. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే అతను నాయకుడని.. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ రోజా తన ప్రసంగం కొనసాగించారు.
ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాల గురించి వివరించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి, నాయకుడంటే ఇలా ఉండాలని జగన్ నిరూపించారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తన పథకాలు అమలు తీరు తెలుసుకొనేందుకు గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారని వివరించారు. విదేశీ చదువులకువిదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. 2024 లోను ఇలాంటి జనరంజకమైన పాలన కొనసాగడానికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా తనకు అండగా నిలవాలంటూ రోజా కోరారు. జగన్ స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతన్నామని చెప్పుకొచ్చారు.