స్మగ్లర్లతో దాడులు చేయిస్తున్నారు, రక్షణ లేదు: రోజా
చిత్తూరు: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు.
నగరి మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంతిపై సోమవారం దాడి జరిగిందని తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శాంతిపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నేత ముద్దుకృష్ణమ నాయుడు వర్గీయులు సోమవారం దాడి చేశారని అన్నారు.
ఈ ఘటనలో ఆమె దుస్తులు చిరిగిపోయాయని, కుడి చేతికి గాయమైందని తెలిపారు. గతంలో జాతర సమయంలో తనపై దాడి జరిగితే, ఇప్పుడు ఛైర్ పర్సన్పై దాడి జరిగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు దిగజారుడు రాజకీయాలే ఈ దాడులకు కారణమని అన్నారు.
చంద్రబాబునాయుడి అండతోనే ముద్దుకృష్ణమనాయుడు దాడులకు పాల్పడుతున్నాడని అన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు స్మగ్లర్లను తన అదుపులోకి ఉంచుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబునాయుడు ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు.