ఏడిపిస్తే బాగుపడరు: బాబుకు రోజా శాపనార్థాలు, విమానం కావాలా..
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసన సభ్యురాలు, ప్రముఖ సినీ నటి రోజా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన గురువారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులో ఉన్నామని చెప్పి, మరోవైపు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును తెలుగుదేశం ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరి చేశారన్నారు. రాయలసీమకు గుండెకాయ వంటి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని రోజా డిమాండ్ చేశారు.
మహిళలను కంటతడి పెట్టించిన వారెవ్వరూ బాగుపడరన్నారు. చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. రెండుసార్లు అనంతపురంకు జిల్లాకు చెంద్రబాబు వచ్చారని, ఇంతవరకు ఈ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదన్నారు.
సీఆర్డీఏ కమిషనర్ పైన వైసీపీ ఆగ్రహం
సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ పైన వైసీపీ నేతలు తమ్మినేని సీతారామ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయవద్దని చెప్పడానికి శ్రీకాంత్ ఎవరన్నారు. శ్రీకాంత్ నీవు రాష్ట్రపతివా లేక రాజ్యాంగేతర శక్తివా అన్నారు. దమ్ముంటే రెండో పంట వేయవద్దని జీవో ఇవ్వాలన్నారు.