మోడీ స్కీంలో సచిన్ టెండుల్కర్ పుట్టంరాజు కండ్రిగకు అగ్రస్థానం
నెల్లూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ అరుదైన పురస్కారం చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో తొలి ప్రాధాన్యంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ ఎంపికైంది.
అక్కడి వసతులను బట్టి ఉత్తమ అవార్డు అందజేయవచ్చునని తెలుస్తోంది. గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన సచిన్.. పుట్టంరాజు కండ్రిగను తీసుకున్నారు. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
దత్తత తీసుకున్న ఆ గ్రామంలో సచిన్ గత ఏడాది పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా ఎంపీలు, మంత్రులు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఎలా జరుగుతోందన్న విషయంపై కేంద్రం దృష్టి సారించింది. ఎంపీలు దత్తత తీసుకున్న ఏఏ గ్రామాలు అభివృద్ధిలో ముందున్నాయనే విషయంపై సమగ్ర వివరాలు సేకరించింది.
ఈ వివరాల ప్రకారం సచిన్ టెండుల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ అగ్రస్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో ఆ గ్రామంలో ఆరు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాయని చెబుతున్నారు. దీంతో ఈ గ్రామం అగ్రస్థానంలో నిలిచింది.
పుట్టంరాజు కండ్రిగకు జిల్లా నుంచి రూ.3 కోట్లు కలెక్టర్ విడుదల చేయగా, మరో దాదాపు రూ.3 కోట్లు సచిన్ ఎంపీ ల్యాడ్స్ నుంచి విడుదల చేశారు. రోడ్డు, భవనాలు, మౌలిక సదుపాయాలు, చేపల వేట, గొర్రెల పెంపకం, చేతివృత్తులకు అవగాహన కల్పించారు. దీనిని సన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో తొలి ప్రాధాన్యత స్థానంలో చేర్చారు.