వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇటీవలే కొత్త సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు రాసిన లేఖ.. కలకలం రేపుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్ హయాంలో జరిగిన దర్యాప్తు తీరును ఆయన తప్పుపట్టారు.
రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని అవినాష్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పక్షపాత వైఖరితో రామ్ సింగ్ దర్యాప్తు చేశారని, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు.

ఇప్పుడు తాజాగా- వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇవే తరహా అంశాలను ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణం అంటూ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే ఈ కేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై సజ్జల ఘాటు విమర్శలు సంధించారు. వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్లా పాకారంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించడం ద్వారా రాజకీయ లబ్ది పొందగలనని ఎవ్వరు కూడా అనుకోరని తేల్చి చెప్పారు.
వైఎస్ వివేకా వంటి సీనియర్ నేతను హత్య చేయించి- పొలిటికల్గా సూసైడ్ చేసుకోవాలని అవినాష్ రెడ్డి ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. షమీమ్తో రెండో వివాహం గురించి కొత్త ఛార్జ్షీట్లో ప్రస్తావించి.. అది కారణం కాదని సీబీఐ అధికారులే తేల్చారని పేర్కొన్నారు. తాను వైఎస్ భారతితో మాట్లాడిన ఫోన్ ఆధారంగా నాలుగు సంవత్సరాల తరువాత ఇప్పుడు కొత్త కథ అల్లారంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications