చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ పై సజ్జల అనుమానాలు ! జైల్లో ఉండాలని కోరుకోం...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆయన హెల్త్ రిపోర్ట్ పై సజ్జల అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన సమావేశాల్లో కొట్టుకుంటున్నారని, మ్యానిఫెస్టో అంటే ఏంటో ఇరుపార్టీలకు తెలుసా అని సజ్జల ప్రశ్నించారు. అలాగే వైసీపీని పదే పదే టార్గెట్ చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపైనా సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబుకు అనారోగ్య సమస్యల వల్ల కోర్టు మినహాయింపులు ఇవ్వచ్చని, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు... 14గంటల పాటు ప్రయాణం చేసి విజయవాడ వచ్చారని గుర్తుచేశారు. అటువంటప్పుడు అనారోగ్యంపై సహజంగానే కామెంట్ చేస్తారన్నారు. చంద్రబాబు లాగా జైల్లో 70 ఏళ్ళు దాటిన వారు చాలా మంది ఉంటారని, అందరికి ఇలా టెస్ట్ లు చేస్తారా అని సజ్జల అడిగారు. చంద్రబాబు జైల్లో ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సజ్జల తెలిపారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ల విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని సజ్జల వెల్లడించారు. మెడికల్ బోర్డ్ లో చంద్రబాబు రిపోర్ట్ లపై చర్చ జరగాలన్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలకు మ్యానిఫెస్టో అంటే ఏంటో తెలుసా అని సజ్జల ప్రశ్నించారు. మ్యానిఫెస్టో ను వెబ్ సైట్ లో తీసేసిన ఘనత టీడీపీదన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశాల్లో కొట్టుకుంటున్నారని గుర్తుచేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చంద్రబాబు ఎజెండా తప్ప ఏమీ లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ప్రతినిధులుగా నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి కనపడుతున్నారన్నారు. తెలంగాణలో పవన్ కూడా ప్రచారం చేయడం లేదన్నారు. పవన్ కానీ, చంద్రబాబు కానీ ఏపీలో ప్రజల్ని ఆకట్టుకోవాలంటే ఇదా పద్ధతి అన్నారు. 2014లో మోసం చేసినట్టు 2024లో ఎందుకు చేయలేమమనే బరి తెగింపు టీడీపీలో ఉందన్నారు. ప్రజల్ని ఇలా పార్టీలు కన్ఫ్యూజ్ చెయ్యొచ్చా అని సజ్జల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications