అవినాశ్ ఇష్యూలో బీజేపీలోని స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయి: సజ్జల సంచలనం..!!
ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసుల జారీ వెనుక బీజేపీలోని స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని వ్యాఖ్యానించారు. లోకేష్, పవన్, చంద్రబాబు లలో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు. జగన్ పాదయాత్ర సమయంలో జరిగినవి ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదన్నారు. నాడు పోలీసుల ఆంక్షలను ఎదుర్కొన్నామని..పోలీసులకు సహకరించామని చెప్పుకొచ్చారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసుల పైన సజ్జల స్పందించారు. ఈ అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.
అవినాశ్ నోటీసుల వెనుక
ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వటం పైన సజ్జల స్పందించారు. అవినాశ్ వ్యవహారంలో రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అవినాశ్ వ్యవహారంలో బీజేపీలో ఉన్న టీడీపీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయంటూ సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. అవినాష్ రెడ్డి సీబీఐకి పూర్తిగా సహకారిస్తారని చెప్పుకొచ్చారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అని పవన్ ఏ ఆధారాలతో అంటున్నారని సజ్జల ప్రశ్నించారు.
ఒక అతిధిలా వచ్చి చంద్రబాబు ఇచ్చిన పాఠం చదవి పవన్ వెళ్లిపోతారని ఎద్దేవా చేసారు. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ , ఎస్టీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో చెప్పిన మూడు ఆప్షన్లు వింటే నవ్వొస్తుందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేసారు.
సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పగలరా
గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందన్నారు. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ...మేము స్పష్టంగా ఉన్నామని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయంగా తాము స్పష్టతతో ఉన్నాయని.. ఎటువంటి గందరగోళం లేదని చెప్పారు. వైసీపీలో సీఎం అంటే వైఎస్ జగన్ ఒక్కరేనని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయగలరా అని సజ్జల ప్రశ్నించారు. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా తమకు ఓకే అని చెప్పారు.
టీడీపీలా రాద్దాంతం చేయలేదు
చంద్రబాబు - పవన్ ఇద్దరూ చెరిసగం అధికారంలో ఉంటామని చెప్పినా పర్వాలేదన్నారు. ఓదార్పు యాత్రలో జరిగిన వాటి గురించి జగన్ ఇప్పటికీ బయట పెట్టలేదని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తమ పై ఆంక్షలు పెట్టినా బయటకి వచ్చి తాము చెప్పలేదని వివరించారు.
పోలీసుల సూచనలు అమలు చేశామని చెప్పారు. తాము అపుడు రాద్దాంతం చేయలేదని గుర్తు చేసారు. 2014 లో ఛాన్స్ ఇచ్చినపుడు చంద్రబాబు అయిదేళ్లల్లో ఏం చేశారో చెప్పగలరా అంటూ నిలదీసారు. టీడీపీ చేసే వితండ వాదానికి ఏం సమాధానం ఉంటుందని సజ్జల పేర్కొన్నారు.