పవన్ కళ్యాణ్ నటుడైతే .. చంద్రబాబు సహజనటుడు .. వారివి హై డ్రామాలు : సజ్జల సెటైర్లు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక పైన వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ నటుడు అయితే, చంద్రబాబు సహజ నటుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పవన్ కు నిలకడ లేదు .. పగలు ఒక పార్టీతో రాత్రి మరో పార్టీతో కలుస్తారు : సజ్జల ఆగ్రహం
గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ప్రజలు ఛీ కొట్టారు
కరోనా సంక్షోభం వల్ల రాష్ట్రంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకంజ వేయలేదని, వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని పేర్కొన్నారు. ఇక విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను చూసిన ప్రజలు ఛీ కొట్టారని, అయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు.
మోడీతో కలిసి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది మర్చిపోయారా ?
గతంలో 2014లో ఈ పార్టీలు ఏం చేశాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ హామీలు ఏమయ్యాయో తిరుపతి ఓటర్లు గుర్తించాలని పేర్కొన్నారు. అప్పుడు టిడిపి, జనసేన కలిసి ఉన్నాయని, ప్రస్తుతం రెండు వేర్వేరుగా ఉప ఎన్నిక కోసం తిరుపతికి వచ్చినా వీటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, తెర వెనుక రెండు పార్టీలు కలిసి ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు రాళ్ళ దాడి హై డ్రామాలను ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి ప్రజలకు చేసిందేమీ లేదని సజ్జల విమర్శించారు.ప్రజల్లోకి వెళ్లి వారు తామేమి చేశామో చెప్పుకోలేకపోతున్నారని అన్నారు
. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేస్తున్న రాళ్లదాడి హైడ్రామాలను ప్రజలు గమనించారని, టిడిపి పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా చెబుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోకేష్ దెబ్బకు టీడీపీ దివాలా తీసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
అచ్చెన్న వీడియో వ్యవహారాన్ని ప్రస్తావించిన సజ్జల సెటైర్లు
పార్టీ భవిష్యత్ అధ్యక్షుడిగా భావిస్తున్న తన కుమారుడిపై అచ్చెన్న అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ చంద్రబాబు మళ్లీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే అంతకంటే సిగ్గులేని జన్మ మరొకటి ఉండదని ఘాటుగా విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన అచ్చెన్నాయుడు అచ్చెన్న వీడియో వ్యవహారాన్ని ప్రస్తావించిన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు . సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. తిరుపతిలో వైసీపీదే విజయం అని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు