పదవులు ఇవ్వకపోవటమే అన్యాయమా, ఇవన్నీ నిజం కాదా - షర్మిలకు సజ్జల ప్రశ్నలు..!!
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల - వైసీపీ మధ్య రాజకీయ యుద్దం ముదురుతోంది. సీఎం జగన్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యల పైన షర్మిల ఘాటుగా స్పదించారు. తన అన్న కోసం తాను, తన తల్లి ఏ రకంగా కష్టపడిందీ వివరించారు. సీఎం అయిన తరువాత జగన్ మారిపోయారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పందించారు. షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేసారు. పదవులు ఇవ్వకపోవటమే అన్యాయమా అని ప్రశ్నించారు.
సజ్జల కీలక వ్యాఖ్యలు : పీసీసీ చీఫ్ షర్మిల వైసీపీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఏ విధంగా కష్టపడిందీ షర్మిల వివరిస్తూ జగన్ తీరును తప్పుబట్టారు. కుటుంబలో చీలిక గురించి ప్రస్తావన చేసారు. ఈ కామెంట్స్ పైన పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు... ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేసారు. పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా అంటూ ప్రశ్నించారు. ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారని ప్రశ్నించారు.

చంద్రబాబు చేతిలో పావుగా : షర్మిలతో పాటుగా వైసీపీ కోసం చాలా మంది కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. షర్మిళ చంద్రబాబు స్క్రిప్ట్ బట్టీపట్టి చదువుతున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు.చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావుగా సజ్జల పేర్కొన్నారు. ఏపి రాజకీయాలపై షర్మిళకు అవగాహన లేదన్నారు. వైఎస్ఆర్ కూతురు, జగన్ సోదరి అనే కారణంతోనే షర్మిళకు ఏపి బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించిందని విశ్లేషించారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ లో షర్మిలను నమ్ముకున్న వారికి ఏం న్యాయం చేసారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిళ ఇప్పుడు అదే పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. హోదా పై వైసీపి ప్రయత్నంలో లోపం లేదని చెప్పుకొచ్చారు. పదవుల కోసం కుటుంబాలు చీలిపోవాలా అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.

ఇవి నిజం కాదా : జగన్ ఓదార్పు యాత్రను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా అని నిలదీసారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా అంటూ సజ్జల ప్రశ్నించారు. వైఎస్ ఆశయాలు ఏమి నెరవేర్చలేదో షర్మిల చెప్పాలని సజ్జల సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో చేరారని ధ్వజమెత్తారు. బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి షర్మిల వైసీపీని టార్గెట్ చేస్తున్నారన్నారు. జగన్ తిరుపతిలో తాను ప్రజలకు చేసిన సేవలను వివరిస్తూ..చేసిన వ్యాఖ్యలను నిరాశావాదంగా టీడీపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications