ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కొత్తజిల్లాల ఏర్పాటు ఎలా ఉండబోతుందో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ సీఎం జగన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సామాజిక సమన్యాయం పాటిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చూస్తున్నారని పేర్కొన్నారు.

క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై సజ్జల క్లారిటీ
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసిన క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈసారి క్యాబినెట్ లో మెజారిటీ మార్పులు ఉంటాయని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, సామాజిక న్యాయానికి అనుగుణంగా సీఎం జగన్ క్యాబినెట్ ఏర్పాటు జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు పది జిల్లాలకు సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయిందని చెప్పిన రామకృష్ణారెడ్డి కొత్త జిల్లాలపై ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక్క చారిత్రక ఘట్టం అని ఆయన పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా జిల్లాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్న చిన్న మార్పులతో నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపిన ఆయన, పౌర సంఘాల సలహాలను పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించారు. 90% ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

కొత్త జిల్లాల వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకే చోట
కొత్త జిల్లాలలో అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకే చోట ఉండేలా నిర్ణయం తీసుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల విభజన జరిగిందని సజ్జలు పేర్కొన్నారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా.. రాజధానిపైనా సజ్జల
ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ప్రధానమైన అడ్డంకిని పేర్కొన్న ఆయన డెడ్లైన్ విధించింది. అభివృద్ధి చేయమంటే ఎలా సాధ్యమవుతుంది అంటూ ప్రశ్నించారు. ఎకరానికి రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతుందని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని పేర్కొన్న ఆయన నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఇక ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టే సిఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications