అసెంబ్లీలో ఛాంబర్లు, గందరగోళం: ఏపీ, టీ మధ్య రగడ
హైదరాబాద్: అసెంబ్లీలో ఛాంబర్ల కేటాయింపు పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఒకే ఛాంబరులో రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకే ఛాంబరును ఇరువురికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం గందరగోళానికి దారి తీసింది.
పార్టీలకు గదులు కేటాయిస్తూ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సీఎల్పీ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ను తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చారు. అదే ఫ్లోర్లో జీ1, జీ2 గదులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న తెరాస ఎల్పీ గదిని కాంగ్రెస్కు కేటాయించారు.
తెలంగాణ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు అసెంబ్లీ లోపల గదులను కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్లకు ఒకే ఛాంబర్ కేటాయించారు. అయితే, ఒకే ఛాంబర్ను రెండు పార్టీల వారికి కేటాయించడంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. విప్ ప్రభాకర్కు కేటాయించిన ఛాంబరును మరో పార్టీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా, విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదును పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వసతులు లేనందున ఏపీ హైదరాబాదు నుండే పాలన జరుపుతోంది.