పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!
సామాన్యుల పైన మరో భారం పడుతోంది. ఇప్పటికే యుద్దం కారణంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రో ఉత్పత్తుల కొరత నిత్యావసరాల పైన పడింది. అటు సిమెంట్.. ఇనుము ధరలు పెరిగాయి. గ్యాస్ కష్టాలతో పలు హోటళ్లు ఆహార పదార్ధాల ధరలు పెంచేసాయి. అటు వంట గ్యాస్ సరఫరాకు సమస్య లేదని చెబుతున్నా.. బుకింగ్ - డెలివరీ లో మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే సమయంలో రెండు ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి.
వరుసగా పెరుగుతున్న ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడి పైన మరో భారం పడింది. పాల ధరలు పెరిగాయి. విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెరిగాయి. లీటరు మీద రూ.2 పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల ధరల పెంపుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే కృష్ణా మిల్క్ యూనియన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మార్కెట్ లో విజయ, సంగం డెయిరీ పాల ధరలు పెరిగాయి.
పెరిగిన ధరలు నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుండగా.. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో మాత్రం ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయిని.. అలానే నెలవారీ పాల కార్డు మీద పాలు కొనుగోలు చేసేవారికి కూడా ఏప్రిల్ 9 వరకు పాత ధరలే అమల్లో ఉంటాయని.. ఆ తర్వాత నుంచి కొత్త ధరలు వర్తిస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకింగ్ సామగ్రి, ఇతరాత్ర ఖర్చులు పెరిగాయని.. అందుకే పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పెరిగిన ధరలు.. అమలు ఇలా
కాగా, తాజా నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న ధరకు లీటరు మీదర రూ.2, అర లీటర్ పాలకు రూ.1 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. స్డాండర్డ్ పాల ధర రూ.62 నుంచి 64, టోన్డ్ పాల ధర రూ.58 నుంచి 60, డబుల్ టోన్డ్ రూ.54 నుంచి 56 పెంచారు. అలాగే హోమోజినైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.68 నుంచి 72, టీ మేట్ రూ.68 నుంచి 70 పెరగనుంది. ఆవుపాలు లీటరు రూ.54 నుంచి 56, టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్(450 గ్రాములు) రూ.32 నుంచి 33 పెంచారు.
సంగం డెయిరీ పాల సేకరణ ధరను పెంచింది. గుంటూరు జిల్లాలో గేదె పాలకు రూ.840 కిలో వెన్నకు, ఆవుపాలకు రూ.310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గేదె పాలకు రూ.830, ఆవుపాలకు రూ.301.. నెల్లూరు జిల్లాలో గేదె పాలకు రూ.820, ఆవుపాలకు రూ.301.. ప్రకాశం జిల్లాలో కేంద్రాలు, డెయిరీ ఫారాల వారికి గేదె పాలకు రూ.840, వెండార్ పాయింట్లకు రూ.820, ఆవుపాలకు రూ.310 కిలో ఘన పదార్థాలకు చెల్లించనున్నట్టు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications