ఇదీ నా బాధ్యత, అయేషా పేరెంట్స్కు థ్యాంక్స్: సత్యంబాబు విడుదల, ఉద్వేగం
ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా హైకోర్టు తేల్చిన సత్యం బాబు ఆదివారం కోర్టు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడారు. తన కుటుంబం దీనావస్థలో ఉందన్నారు.
హైదరాబాద్: ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా హైకోర్టు తేల్చిన సత్యం బాబు ఆదివారం కోర్టు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడారు. తన కుటుంబం దీనావస్థలో ఉందన్నారు.
తనలాగే ఎంతోమంది జైలులో మగ్గుతున్నారని చెప్పారు. న్యాయమే తనను గెలిపించిందన్నారు. తనకు సహకరించిన ఆయేషా తల్లిదండ్రులుకు ధన్యవాదాలు చెప్పారు. వారి వద్దకు ఇప్పుడు వెళ్లినా తనను నిర్దేషి అంటారని, వారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నారు.
తన కోసం తన గ్రామాస్తులు ధర్నా చేశారని చెప్పారు. తన గ్రామస్తులు ఇంటికి రూ.200 చొప్పున పోగు చేసి తనకు సహాయం చేశారన్నారు. తన గ్రామస్తుల మేలు ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
తల్లి రుణం, చెల్లి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లాయర్ సలహా ప్రకారం ఏం చేయాలో తాము నిర్ణయిస్తామన్నారు. తన వల్ల మా అమ్మ కోర్టు మెట్లు ఎక్కిందని, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందన్నారు. ఆయన ఉద్వేగానికి గురయ్యారు.
అమాయకుడికి శిక్ష
ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఎనిమిదేళ్ల పాటు ఓ అమాయకుడిని శిక్షించారని, తన కుమార్తె అయేషాను హత్య చేసిన హంతకులు బయటే ఉన్నారని ఆమె తల్లిదండ్రులు సంషాద్ బేగం, ఇక్బాల్ రెండు రోజుల క్రితం చెప్పారు. ఇప్పటికైనా అసలైన దోషులను ప్రకటించి, కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. పదేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన తెనాలి అమ్మాయి ఆయేషా మీరా కేసులో శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు.
నాటి పైశాచిక సంఘటన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రాధేయపడ్డా న్యాయానికి బదులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ తల్లిదండ్రులు చెప్పారు. అమాయకుడైన సత్యంబాబు అనుభవించిన శిక్షకు బాధ్యులుగా పోలీసులకు రూ.లక్ష జరిమానా సరిపోదని, వారికి రూ.కోటి జరిమానా వేసినా తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో దోషులను తప్పించే విషయంలో పోలీసులదే పూర్తి బాధ్యతని, వారే అసలైన దోషులని చెప్పారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆనాడే కోర్టులో చెప్పి వచ్చేశామని, ఇది ఆ దేవుడిచ్చిన తీర్పన్నారు.
హైకోర్టు తీర్పుతో సగం న్యాయం జరిగిందని, అసలు దోషులను శిక్షించాక పూర్తి న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్కుమార్, కవిత, సౌమ్య, ప్రీతి, హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ, ఆమె భర్త ఐనంపూడి శివరామకృష్ణలపై తిరిగి విచారణ జరిపించాలని కోరారు.
సత్యం బాబు నిర్దోషి
తెనాలి అమ్మాయి ఆయేషా మీరా విజయవాడ సమీప ఇబ్రహీంపట్నంలోని ఓ వసతిగృహంలో ఉండి చదువుకుంటూ 2007 డిసెంబరు 27న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. సంఘటన వెనుక కొందరు రాజకీయ పెద్దల కుటుంబీకులు ఉన్నారన్న ఆరోపణలు రేగాయి. అప్పట్లో పోలీసులు అనేక మందిని దోషులుగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనాసాగరానికి చెందిన సత్యంబాబును చివరకు దోషిగా తేల్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు అప్పటినుంచి హైకోర్టులో విచారణలో ఉంది. శుక్రవారం హైకోర్టు తీర్పును వెలువరిస్తూ సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది.
గ్రామస్తుల సంతోషం
సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆయన విడుదల కావడంతో అతని తల్లి, సోదరి, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. అమాయకుడ్ని పోలీసులు కేసులో ఇరికించి ఎనిమిదేళ్లుగా జైలులో ఉంచారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం ప్రకటించారు. సత్యం బాబు జైలుపాలు కావడంతో ఎనిమిదేళ్లుగా అతని కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. అయేషా హత్య కేసులో కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరానికి చెందిన పిడతల సత్యంబాబును 2008 ఆగస్టు 15న నందిగామలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
సత్యం బాబు
ఏడో తరగతితో చదువు ఆపేసి, తాపీ పనులకు వెళ్తుండేవాడు. ఆయన తల్లి మరయమ్మ, తండ్రి వెంకయ్య, సోదరి సత్యమ్మలతో కలిసి గ్రామంలోని గుడిసెలో ఉండేవారు. 2008 ఆగస్టులో సత్యంబాబును నందిగామ పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయేషా హత్యతోపాటు, నందిగామలో బాలికల హాస్టళ్లలో ప్రవేశించి, మహిళలపై దాడులకు, లైంగిక వేధింపుల కేసుల్లో అతను నిందితుడంటూ అరెస్ట్ చేశారు. అతను జైలుపాలు కావడంతో కుటుంబసభ్యులు నానా ఇక్కట్లూ పడుతున్నారు.
సత్యంబాబు జైలుకు వెళ్లిన కొన్ని నెలలకు అనారోగ్యంతో అతని తండ్రి మృతి చెందారు. సత్యంబాబును జైలు నుంచి పంపకపోవడంతో అంత్యక్రియలను అతని సోదరి నిర్వహించారు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుమార్తెను నర్సింగ్ కోర్సు చదివించారు. ఇపుడామె నందిగామలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. గ్రామంలో గుడిసె రెండేళ్ల కింద కాలిపోవడంతో అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. వీలైనప్పుడు సోదరి కుమారుడు సహాయంతో ఆమె రాజమండ్రి వెళ్లి కుమారుడ్ని జైలులో కలిసి వచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని సత్యంబాబు తల్లి సంతృప్తి ప్రకటించారు. తమ కుమారుడ్ని చేయని నేరానికి పోలీసులు జైలుకి పంపినందున ప్రభుత్వం బాధ్యత వహించి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు.