రేణుకా చౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు: కళావతి ఫిర్యాదు
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మరో ఆరుగురిపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని తన భర్త నుంచి కోటిరూపాయలు పైగా తీసుకుని మోసం చేశారంటూ జనరల్ సర్జన్ డాక్టర్ రాంజీ భార్య భూక్యా కళావతి హైకోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగురోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కోసం రేణుకాచౌదరికి తన భర్త రాంజీ కోటి రూపాయలకు పైగా చెల్లించారని, అయితే సీటు కేటాయించలేదని కళావతి అన్నారు. ఇటీవల తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని రేణుకా చౌదరిని కోరితే ఇవ్వలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మరో ఆరుగురిపైనా ఆమె ఫి ర్యాదు చేశారు. అభియోగాలు మోపబడ్డ వారందరిపై కేసు నమోదుచేయాలని హైకోర్టు అర్బన్ పోలీసులను ఆదేశించింది.
దీంతో రేణుకాచౌదరి, పుల్లయ్య, రామారావు, సైదులు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్రెడ్డిలపై అర్బన్ పీఎస్లో నాలుగురోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే రేణుకా చౌదరి దౌర్జన్యానికి పాల్పడుతోందని కళావతి ఆరోపించారు. తన భర్త ఇచ్చిన కోటి రూపాయలు పైగా డబ్బులు ఇవ్వకపోతే రేణుకా చౌదరి ఇంటి ముందే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆమెకు డబ్బులు ఇచ్చినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యదర్శి రవిచంద్ర చౌహాన్, భానోతు భద్రునాయక్తో కలిసి ఆమె మాట్లాడారు. డబ్బులిచ్చిరన ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో తాను ఇన్ని రోజులు బయటికి రాలేదని వెల్లడించారు.
కాగా, తనపై ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని, కొందరు కావాలని తనపై కేసు పెట్టించారని రేణుకా చౌదరి అన్నారు. తన గురించి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసునని, రాజకీయంగా ఎదుర్కోలేక కొంత మంది ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. రాజకీయ జీవితంలో తాను ఏనాడు కూడా అవినీతికి పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు.