ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన ఎల్జీ పాలీమర్స్...నేడు విచారణ..!
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని సైతం నియమించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. ఎంతటి వారైనా సరే సహించేది లేదంటూ పేర్కొంది. మనుషులు, జంతువుల ప్రాణాలు తీసిన స్టైరీన్ అనే ఈ రసాయనాన్ని కొన్ని టన్నుల్లో దక్షిణ కొరియాకు ప్రత్యేక నౌకలో తరలించింది ఏపీ ప్రభుత్వం.
ఇక ఈ గ్యాస్ లీకేజీ ఘటనను జాతీయ హక్కుల సంఘంతో పాటు ఏపీ హైకోర్టుకూడా సీరియస్గా రియాక్ట్ అయ్యాయి. ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఇక ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయి పర్యావరణంకు హానీ కలగడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా సీరియ్గా రియాక్ట్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరణ ఇవ్వాలంటే నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంకు రూ.50 కోట్లు మధ్యంతర మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఆన్లైన్ ద్వారా అత్యున్నత ధర్మాసనం విచారణ చేయనుంది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ శాంతను గౌడార్, జస్టిస్ వినీత్ శరణ్లతో కూడిన వర్చువల్ కోర్టు ఈ కేసును విచారణ చేయనుంది. ఇదిలా ఉంటే విశాఖ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం కింద ప్రకటించిన రూ.కోటి అందజేయడం జరిగింది. ఇక నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలను గుర్తించి నివేదిక అందజేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.