రెండో ఆలోచనలేదు: బొత్స, కిరణ్ నో అన్లేదు: టిపై డొక్కా
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, అందులో మరో ఆలోచనకు తావులేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. ఆయనకు ఇటీవల సీమాంధ్రలో సమైక్య సెగ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెసు నేతలమంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నామని, అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.
కిరణ్ ఎప్పుడు విభజనను వ్యతిరేకించలేదు: డొక్కా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విభజన విషయం అంతా తెలుసునని, ఎప్పుడు ఆయన వ్యతిరేకించలేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో అన్నారు. అధిష్ఠాన నిర్ణయాన్ని పార్టీ వేదికలపై ఎప్పుడూ ముఖ్యమంత్రి ప్రశ్నించలేదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పుడు సిఎం వ్యతిరేకించినా, రాజీనామా చేసినా ఈ విభజన ప్రక్రియ ముందుకు కదిలేది కాదన్నారు.
అసలు సిఎం అంగీకారమే లేకుంటే విభజన ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. సిఎం అనుచరులు కొందరు ఓ పథకం ప్రకారమే రాష్ట్ర విభజనకు బొత్స కారణమంటూ దుష్ప్రచారం చేశారని, ఆ తర్వాత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పైనా నిందలు మోపారన్నారు.
అసెంబ్లీ ప్రోరోగ్ విషయంపై ఇప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్పై కూడా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంఘటనలపై విచారణ జరిపించాలని బొత్సను తాను కోరనున్నట్లు చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ముఖ్యమంత్రి పదవి వస్తే తానే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వారు ఎలాబడితే అలా మాట్లాడటం తగదన్నారు.