బోగి మంటల్లో తెలంగాణ బిల్లు: అశోక్ బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్నందున శాసనసభ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉందని ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. శుక్రవారం ఏపిఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, ఆ తర్వాత బిల్లును ఓడించాలని ఆయన కోరారు. జనవరి 13న బోగీ మంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను తగలబెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జనవరి 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్కు పిలుపునివ్వాలని ఉద్యోగ సంఘాల సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.

జనవరి 20న చలో అసెంబ్లీని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న సీమాంధ్ర జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ బిల్లును ఓడిస్తామని ప్రజల సమక్షంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు హామీ ఇవ్వాలని అశోక్ బాబు అన్నారు.
ఏపిని తెలుగునాడుగా మార్చాలి: డొక్కా
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా నామకరణం చేయాలని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన శుక్రవారం తెలంగాణ ముసాయిదా బిల్లుపై 9 సవరణలు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని అన్నారు. విభజన తర్వాత భద్రాచలంను తెలుగునాడు రాష్ట్రంలో కలిపిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నియోజక వర్గాల పునర్విభజన చేసి ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెంచాలని ఆయన కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలోనూ 2 అసెంబ్లీ స్థానాలను పెంచాలని తెలిపారు. సాగుభూములను పరిశ్రమలకు కేటాయించకుండా నిషేధం విధించాలన్నారు. కాగా శాసనమండలి జనవరి 18కి వాయిదా పడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు తెలంగాణ బిల్లుపై ఎలాంటి సవరణలు కోరలేదు.
దాడులు జరుగుతాయేమో, ఐక్యంగా ఉండాలి: గాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణ నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డిపై తెలంగాణ ప్రాంత నేతలు దాడికి దిగారని, ఇదే ఘటన మిగితా సీమాంధ్ర నేతల పట్ల కూడా జరిగే అవకాశం ఉన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సీమాంధ్ర నేతలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని, అందుకే సీమాంధ్ర నేతలందరూ పార్టీలతీతంగా ఐక్యంగా ఉండాలని ముద్దుకృష్ణమ కోరారు.












Click it and Unblock the Notifications