సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ
హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ జెఏసి నాయకులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ముఖ్యమంత్రితో చర్చలు ముగిసిన అనంతరం ఉద్యోగుల జెఏసి నేత సాయిబాబా మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తుపాను, పండగల కారణంగా సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్ల నివేదికను కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణ్ పంపిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర నెరవేరుస్తుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే తాము ప్రకటించిన విధంగా నిరసనలు కొనసాగుతాయని సాయిబాబా అన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తే ఎలా ఉంటుందనేది కేంద్రానికి తెలిసిందని ఆయన అన్నారు. తమ ఉద్యమంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చిందని భాస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే మళ్లీ ఉద్యమిస్తామని వారు అన్నారు.
రేపు ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ ఉద్యోగులు అందరూ విధులకు హాజరు కావాలని ఉద్యోగ జెఏసి ప్రతినిధులు కోరారు. 30వేల మంది శాశ్వత ఉద్యోగులు, 15వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మె వల్ల ఎదురైన ఇబ్బందులను భరించిన ప్రజలు, విద్యార్థులకు ఉద్యోగ సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యాయి. ఆస్పత్రుల్లో వైద్య సేవలకు కూడా విఘాతం కలిగింది. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 30 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దాంతో సీమాంధ్రలో 4 వేల మెగావాట్ల థర్మల్, హైడల్ విద్యుదుత్పత్తి ఆగిపోయింది.