ఏబీ వెంకటేశ్వరరావు కేసులో అనూహ్య మలుపు!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన సస్పెన్షన్ అంశంపై సోమవారం విచారణ జరిగింది. హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పును వాయిదా వేసింది. తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఏబీ క్యాట్ లో సవాల్ చేశారు. క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్, నాన్జ్యుడిషియల్ సభ్యురాలు శాలినీ మిస్త్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తే పిటిషనర్ సాక్షులను బెదిరిస్తారని, గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారనే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తన వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉందని, చార్జిషీటు దాఖలైన తర్వాత వాదనలు ముగిసే వరకు సస్పెన్షన్ లో ఉంచే అధికారం తమకుందన్నారు. దర్యాప్తును నిందితులు ప్రభావానికి గురిచేస్తున్నాడనే కారణంపైనే సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.

ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో తన క్లైంట్ ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఏబీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రెండు సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉన్నారని, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖలో పోస్టు ఇచ్చినా ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిపారు. మొదటిసారి సస్పెండ్ చేసినప్పుడు ఎటువంటి కారణాలనైతే చూపించారో రెండోసారి కూడా అవే కారణాలను పేర్కొంటున్నారని, అది చట్టవిరుద్ధమన్నారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును రెండు సార్లు సస్పెండ్ చేశారని, ఇలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని క్యాట్ దృష్టికి తెచ్చారు. పిటిషన్ ను అనుమతించాలని, వెంటనే తన క్లైంట్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications