కాక్రోచ్ మార్చ్ పై పోలీసు దాడులు, ప్రతిదాడులు..! సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ పై పోలీసులు లాఠీచార్జ్ లు, భాష్పవాయువు ప్రయోగాలతో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు (Supreme Court).. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు సీజేఐ సూర్యకాంత్ ప్రకటించారు.
సీజేపీ చేపట్టిన నిరసనల అణచివేతకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక, పారదర్శక, సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని, అలాగే విచారణ కమిటీ కూర్పును కూడా కోర్టే నిర్ణయిస్తుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలిపారు. పోలీసుల చర్యలు, జన సమూహ నియంత్రణకు సంబంధించిన సూత్రాలను సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులలో నిర్దేశించినప్పటికీ, ఇప్పుడు ఆ రక్షణ చర్యలను పటిష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీజేఐ గుర్తుచేశారు.

సీజేపీ నిరసనల అణచివేతకు సంబంధించి తలెత్తిన విస్తృత ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీ, సిట్ లేదా కోర్టు ఏర్పాటు చేసే మరేదైనా స్వతంత్ర సంస్థ విచారణ జరపాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలిపారు. నిష్పక్షపాత విచారణ ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు. పోలీసులపై ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై దాడులతో సహా కోర్టు ముందు లేవనెత్తిన అన్ని అంశాలను శాస్త్రీయంగా విచారించాల్సి ఉంటుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తు సాక్ష్యాధారాలతో కూడినదిగా, సమగ్రంగా , స్వతంత్రంగా ఉండాలని ఆయన సూచించారు. నిరసనల సమయంలో పోలీసుల స్పందనను నియంత్రించడానికి ప్రామాణిక నియమావళిని ఏర్పాటు చేయాలని కోరుతూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీజేఐ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications