ఆధునిక ఇంజనీర్లకు సవాల్.. శేషాచలం అడవుల్లో ‘స్టోన్ అక్విడక్ట్స్’
తిరుమల శేషాచలం దట్టమైన అడవులు, కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు కొండలు కేవలం ఎర్రచందనానికి, ఆధ్యాత్మికతకే కాదు... మన పూర్వీకుల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి కూడా నిలువెత్తు నిదర్శనమనే విషయం చాలామందికి తెలియదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడిని నివారించడానికి నిర్మించిన అరుదైన నీటి నిర్వహణ వ్యవస్థలు నేటికీ చెక్కుచెదరకుండా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఇంజనీరింగ్ నైపుణ్యం ఎలా సాధ్యమైందా? అని నేటి మహామహులైన ఇంజనీర్లే ఆశ్చర్యపోతున్నారు.
చిన్న చిన్న కనుమ మార్గాల ద్వారా అనుసంధానం
కొండలపై కురిసే ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపట్టాలనే దూరదృష్టితో, నిటారైన కొండ రాళ్లను సుత్తి-పారలతో తొలిచి కిలోమీటర్ల కొద్దీ ప్రవాహ మార్గాలను నిర్మించారు. అడవుల్లోని ఎత్తైన లోయల నుండి నీరు ప్రవహిస్తూ కింద ఉన్న దిగువ చెరువులు, దిగుడు బావులు, జలాశయాలు, ఆలయ కోనేరులను చేరుకునేలా ఈ రాతి కాలువలను ఎంతో నైపుణ్యంతో రూపొందించారు. నీటితో పాటు కొండరాళ్ల ఊట నీరు కూడా వృథా కాకుండా ఈ రాతి కాల్వల్లోకి చేరేలా చిన్న చిన్న కనుమ మార్గాలను కూడా అనుసంధానించడం విజయనగర కాలపు జల నిర్వహణ నైపుణ్యానికి పరాకాష్ఠ.

రాళ్ల కిందకు కొట్టుకురాకుండా..
నేటి ఆధునిక కాలంలో వాడుతున్న శాటిలైట్ మ్యాపింగ్, లేజర్ సర్వే పరికరాలు, లెవలింగ్ సాధనాలు ఏవీ లేని ఆ రోజుల్లోనే... కొండల సహజమైన వాలును అంగుళం కూడా తేడా లేకుండా అంచనా వేసి ఈ నిర్మాణాలు చేపట్టిన తీరు అత్యంత విస్మయాన్ని కలిగిస్తుంది. కొండ రాళ్ల మధ్య నీటి ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరిస్తూ, వర్షపు నీటితో పాటు వచ్చే ఒండ్రు మట్టి లేదా రాళ్లు కిందకి కొట్టుకురాకుండా సహజ వడపోత జరిగేలా నిర్మించిన ఈ కాలువల నిర్మాణం నేటి సివిల్ ఇంజనీర్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
నీరు లీకవకుండా కారాన మిశ్రమం
రాతి కాలువల మధ్యలో నీరు లీక్ కాకుండా ఉండేందుకు రాళ్లను కలుపుతూ ప్రత్యేకమైన సాంప్రదాయ కారాన మిశ్రమాన్ని వాడేవారు. సున్నం, బెల్లం, కరక్కాయ, జిగురు, గుడ్డు తెల్లసొన వంటి పదార్థాల కలయికతో తయారుచేసిన ఈ లేపనం శతాబ్దాల పాటు నీటిలో ఉన్నా పాడవకుండా, నీరు లీకవకుండా చూస్తోంది.శతాబ్దాలు గడిచినా, శేషాచలం దట్టమైన అడవుల్లో ప్రాచీన రాతి శిథిలాల మధ్య దాగి ఉన్న ఈ 'రాయల కాలపు రాతి కాలువలు' మన పూర్వీకుల దూరదృష్టికి, వర్షపు నీటి సంరక్షణ ప్రణాళికకు, అద్భుత శిల్పకళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇలాంటివి భారతదేశ అతి పురాతన సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి.














Click it and Unblock the Notifications