పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతు
కడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వారి కోసం గాలింపు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన వెంకట శివ స్నేహితులు 10 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఆ తర్వాత శివతో కలిసి 11 మంది పెన్నా నది దగ్గరకు వెళ్లారు. వీరిలో 8 మంది స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈ కార్యక్రమంలో వీరంతా ఒక్కసారిగా మునిగిపోయారు. అతికష్టం మీద వెంకట శివ నది నుంచి బయటపడ్డాడు. మిగితా ఏడుగురు నదిలో గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో యశ్వంత్, సోమశేఖర్, తరుణ్, జగదీశ్, రాజేశ్, సతీష్, షన్ను ఉన్నారు. కాగా, గల్లంతైన వారిలో ఇద్దరు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మరో ఐదుగురి కోసం పోలీసులు, గజఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఇద్దరు మృతి చెందడం, ఐదుగురు గల్లంతవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.