టిట్లీ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలం, భారీ వర్షాలు: తీర ప్రాంతాలకు హెచ్చరిక
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడే టిట్లీ తుఫాను తూర్పు తీరంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

వాయుగుండం తీవ్ర తుఫానుగా..
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు ‘టిట్లీ' పేరును సూచించారు. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు.

రాత్రి వరకు తుఫానుగా..
కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ' కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు
పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి అక్టోబర్ 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిశా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో బుధవారం, గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

బలమైన గాలులు.. వర్షాలతో అల్లకల్లోలం.. హెచ్చరిక
మంగళవరాం రాత్రి తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications