చంద్రబాబు పాత మిత్రుడు, అందుకే కలిశా: శంకర రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు సోమవారం ఉదయం కలిశారు. ఆసుపత్రిలో ఉన్న బాబును పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ వయసులో ఐదు రోజుల పాటు దీక్ష చేయడం వల్లే బాబుకు సమస్యలు తలెత్తాయని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు పాతమిత్రుడని, మానవతాదృక్పథంతోనే బాబును కలిశానన్నారు. దీనికి రాజకీయాలతో సంబంధంలేదని చెప్పారు.
కాగా, తెలుగు జాతికి న్యాయం చేయాలంటూ దీక్ష చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాబుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించిన విషయం తెలిసిందే. బాబు యోగక్షేమాల గురించి ఫోన్ చేసి ఆరా తీశారు. ఢిల్లీ ఆంధ్రాభవన్లో ఆరు రోజులు దీక్ష చేసినా, బిజెపికి చెందిన ఏ ఒక్కరూ బాబును నేరుగా వచ్చి పరామర్శించలేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మోదీ పలకరింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడు రోజులుగా బాబు దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న మోడీ... ఈ వయసులో ఇంత తెగింపు వద్దని, ఆరోగ్యం కాపాడుకోవాలని, మీలాంటి నాయకులు దేశానికి అవసరమని హితవు చెప్పారు.