షర్మిలమ్మ.. మేమంతా ఒక్కటే : జగన్ నాడు కాంగ్రెస్ తో కలిసి ఉంటే - మంత్రి బాలినేని..!!
ఏపీలో పార్టీ ఏర్పాటు గురించి వైఎస్సార్టీపీ అధినేత్రి.. సీఎం జగన్ సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో పార్టీ పెడతారా అనే ప్రశ్నకు సమాధానంగా.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఏపీలో పార్టీ పెట్టననే అంశాన్ని ఎక్కడా తోసిపుచ్చ లేదు. కొంత కాలంగా సీఎం జగన్ - షర్మిల మధ్య విభేదాల కారణంగా షర్మిల ఏపీలోనూ పార్టీ పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది.
మేమంతా వైఎస్సార్ కుటుంబం
ఇక, షర్మిల స్పందన హాట్ డిబేట్ గా మారింది. ఇదే సమయంలో ఈ వ్యాఖ్యల పైన ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఏపీలో పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదని బాలినేని అన్నారు. ఏపీలో షర్మిల పార్టీ పెడతారంటూ అభూత కల్పన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో... షర్మిలమ్మ మేం అంతా వైయస్సార్ కుటుంబం.. మేమంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. తాజాగా ప్రభుత్వం పైన చంద్రబాబు ప్రభుత్వం పైన చేసిన విమర్శల పైనా మంత్రి బాలినేని స్పందించారు.
జగన్ నాడు కాంగ్రెస్ తో కలిస్తే
చంద్రబాబు చేసిన విద్యుత్ బకాయిలు కూడా ఇప్పుడు తీరుస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పోలవరంలో ఏమి చేసారో అందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెడితే..చంద్రబాబు గత ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చుట్టూ తిరిగారంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారంటూ విమర్శించారు. నాడే జగన్ కాంగ్రెస్ తో కలిస్తే కేసులు మాఫీ చేసేవారని..కానీ, కేంద్రంలో ఉన్న సోనియాను జగన్ ధిక్కరించి పార్టీ ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పైన కేసులు నమోదైతే ఏదో విధంగా స్టే తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు.
Recommended Video
చంద్రబాబు అప్పట్లో మోదీని కలవటం వెనుక
సీఎం జగన్ ప్రధానిని కలిస్తే కేసుల మాఫీ కోసం వెళ్లారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించటం పైన బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీని 29 సార్లు కలిశారని.. ఎందుకు కలిసినట్లని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మూడు లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయిందంటూ మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు.