ఆ విషయం తెలియదా: ముద్రగడ పద్మనాభంపై చలమశెట్టి ధ్వజం
హైదరాబాద్: కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీని విమర్శించడమే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పనిగా పెట్టుకున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామానుజయ్య మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఆనాడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.
టిడిపి కాపుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే విమర్శించడం దారుణమని ఆయన అన్నారు. కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న టిడిపిని విమర్శించడం దిగజారుడుతనమేనని విమర్శించారు. కాపులను బిసిల్లో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పి అమలుచేయకుండా పదేళ్లపాటు కాలక్షేపం చేసిందని, ఈ విషయాన్ని ఎన్నో మార్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని అన్నారు.
2004 నుండి 2014 వరకూ కాపుల సంక్షేమానికి అప్పటి ప్రభుత్వాలు చేసిన కృషి ఏమీ లేదనే విషయం ముద్రగడ పద్మనాభంకు తెలియదా అని ప్రశ్నించారు. టిడిపి అత్యధిక సీట్లు కాపు సామాజిక వర్గానికి కేటాయించి వారికి పదవులిచ్చి ప్రోత్సహించిందని చెప్పారు.
ఎందరినో పెద్ద నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ , చంద్రబాబులకే దక్కుతుందని కొనియాడారు. ఇప్పుడు కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా టిడిపిదేనని చలమలశెట్టి స్పష్టం చేశారు.