ఎపి రాజధాని: బాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసరత్తు వేగవంతమైంది. శనివారం ఉదయం రాజధాని ఎంపిక కోసం గత యుపిఎ ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై వారు చర్చించారు. చంద్రబాబుకు కమిటీ సభ్యులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు.
నలుగురు సభ్యులతో పాటు చైర్మన్ శివరామకృష్ణన్ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వ సూచనలు సలహాలు తీసుకున్న అనంత రం కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు రాజధాని ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. దీనిపై ఆగష్టు 31 నాటికి కేంద్రానికి కమిటీ నివేదిక అందించనుంది.
కొత్త రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు చంద్రబాబుతో చర్చించారు. తమ పర్యటన వివరాలను వారు చంద్రబాబుకు వివరించారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు.
కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరిపారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని చంద్రబాబు ఇదివరకే చెప్పారు.