నూతన సంవత్సరం వేళ ఏపీలో హృదయ విదారక విషాదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరానికి అందరూ సంతోషంగా స్వాగతం పలుకుతుంటే, కొత్త సంవత్సరం సాక్షిగా ఓ తండ్రి అమానుష ఘటనకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని అమాయక పిల్లలను ముగ్గురిని హతమార్చి, తాను కూడా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన తండ్రి
ఘటన వివరాలలోకి వెళితే నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలో జరిగిన దారుణ ఘటనలో ఓ తండ్రి ముగ్గురు పిల్లల ప్రాణం తీశాడు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేముల పాటి సురేంద్ర తన ముగ్గురు పిల్లలు అయిన ఏడు సంవత్సరాల కావ్య శ్రీ ని, నాలుగేళ్ల జ్ఞానేశ్వరిని, రెండు సంవత్సరాల సూర్య గగన్ లను అమానుషంగా చంపేశాడు.

కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపిన తండ్రి
ముగ్గురికి విషం కలిపిన కూల్ డ్రింక్ ను తాగించి ప్రాణం తీశాడు. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత ఆగస్టు 16వ తేదీన సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుని మరణించింది. భార్యమరణం తర్వాత మానసికంగా ఆవేదన పడుతున్న సురేంద్ర తాను కూడా బ్రతకడం భారంగా భావించి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
చిన్నారులను తండ్రి చంపిన ఘటనతో స్థానికంగా విషాదం
ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆణిముత్యాల్లా ఉన్న ముగ్గురు పిల్లల ప్రాణాలు అనవసరంగా తీసాడని, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది పిల్లల కోసం తాపత్రయ పడుతుంటే, పండంటి బిడ్డల ప్రాణం తీయడానికి ప్రాణం ఎలా వచ్చిందని స్థానికులు చర్చిస్తున్నారు.
కొత్త సంవత్సరం తొలినాడే ఈ తరహా ఘటన
కొత్త సంవత్సర వేడుకల మాట అటుంచి విగత జీవులైన వారందరినీ చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఏదైనా సరే, ఎవరైనా సరే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొత్త సంవత్సరం తొలినాడే ఈ తరహా ఘటన వెలుగు చూడటం అందరినీ బాధిస్తుంది.












Click it and Unblock the Notifications