వాళ్ల మేనిఫెస్టో.. వాళ్లు రిలీజ్ చేసుకున్నారు: టీడీపీ కూటమిపై బీజేపీ సీనియర్ నేత
TDP Janasena BJP Manifesto: తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చోటు చేసుకున్న గందరగోళంపై బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు. దీనిపై ఆయన అక్కడికక్కడే వివరణ ఇచ్చారు.
తాను ఒక జాతీయ పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నానని, తమ సొంత మేనిఫెస్టోను ఇదివరకే విడుదల చేశామని సిద్ధార్థ్ నాథ్ అన్నారు. తెలుగుదేశం- జనసేన సంకీర్ణ కూటమిలో తాము భాగస్వామిగా ఉండటం వల్ల కూటమి నేతలకు మద్దతుగా తాను ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు. టీడీపీ- జనసేన వాళ్ల మేనిఫెస్టోను వాళ్లు విడుదల చేసుకున్నారని, తాను మద్దతుగా ఉన్నానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదని తేల్చి చెప్పారు.

మేనిఫెస్టో విడుదల సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్తో కలిసి దీన్ని విడుదల చేయడానికి బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముందుకు రాలేదు. మేనిఫెస్టో కాపీని ఆయనకు అందజేసినప్పటికీ ఆయన దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. వద్దన్నట్లు చేతులు ఊపారు.
ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ కూడా పొరుగునే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోన్నవే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకుని నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతినెలా నగదు పంపిణీ.. వంటి హామీలన్నీ కాంగ్రెస్కు చెందినవే. వాటిపై పేటెంట్ రైట్స్ అన్నీ కూడా కాంగ్రెస్వే.
అలాంటి హామీలను తమ కూటమి మేనిఫెస్టోలో చేర్చడమే బీజేపీ అసంతృప్తికి కారణం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ మేనిఫెస్టోను తాము సమర్థించితే కాంగ్రెస్ ఉచిత విధానాలతో తాము ఏకీభవించినట్టవుతుందనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందని, అందుకే సిద్ధార్థ్ నాథ్ సింగ్.. దీన్ని ఆవిష్కరించడానికి నిరాకరించారని అంటున్నారు.
దీనిపై ఇక సిద్ధార్థ్ నాథ్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి తెర దించినట్టయింది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను కర్ణాటకలో వ్యతిరేకిస్తోన్న బీజేపీ.. అవే పథకాలకు ఏపీలో మద్దతు ఇచ్చినట్టయిందనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఇది బీజేపీ ద్వంద్వనీతికి నిదర్శనమంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications