పవన్ తనయుడిని కాపాడింది వీళ్లే- రుణం
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటన.. రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు రాజకీయ నాయకులు, ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లో మూడంతస్తుల భవనం సోప్హౌస్లో గల టమాటో కుకింగ్ స్కూల్లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న పిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవనోవిచ్ సహా 20 మంది విద్యార్థులు ఉన్నారు.

సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో షాప్ హౌస్ బిల్డింగ్ రెండు, మూడో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. శంకర్ ఆరోగ్యం బాగుందని, ప్రస్తుతం కోలుకుంటోన్నాడని చిరంజీవి వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడనీ చెప్పారు.
తమ కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. హనుమంతుడు ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి తమకు అండగా నిలిచాడని అన్నారు.
అగ్నిప్రమాదం ఘటనలో మార్క్ శంకర్ సహా ఇతర విద్యార్థులను నలుగురు భారతీయులు ప్రాణాలను ఒడ్డి కాపాడారు. ఇందర్జిత్ సింగ్, సుబ్రహ్మణ్యం శరణ్రాజ్, నాగరాజన్ అన్బరాసన్, శివస్వామి విజయ్రాజ్ అనే నలుగురు భారతీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్నారులను క్షేమంగా సంఘటన స్థలం నుంచి బయటికి తీసుకుని వచ్చారు. రెస్క్యూ సిబ్బందికి సహకరించారు.
ఈ నలుగురు కూడా వలస కార్మికులు. ఉపాధి కోసం సింగపూర్కు వెళ్లారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వాళ్లు అక్కడే ఉన్నారు. షాప్హౌస్ బిల్డింగ్లో ఉన్న స్కూల్ నుంచి పిల్లల అరుపులు వినిపించడం, కిటికీ నుండి దట్టమైన పొగ వెలువడుతుండటాన్ని గమనించిన ఆ నలుగురు వెంటనే రంగంలోకి దిగారు. నిచ్చెనను ఉపయోగించి.. సంఘటన స్థలానికి చేరుకున్నారు.
స్కూల్ పిల్లలు, సిబ్బందిని ఈ నలుగురూ తమ చేతులతో మోసుకుంటూ కిందకి దించారు. దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నప్పటికీ లెక్కచేయలేదు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందు ఈ నలుగురు కూడా మార్క్ శంకర్ సహా 10 మంది పిల్లల ప్రాణాలను కాపాడారు.
వారి కృషిని సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరించింది. ఆ దేశ మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ వారిని సన్మానించింది. ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే అస్యూరెన్స్, కేర్ అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్ రివార్డ్ ప్రకటించింది. ఫ్రెండ్స్ ఆఫ్ ఏస్ కాయిన్లను అందజేసింది.












Click it and Unblock the Notifications