సింగపూర్ ఇలా అద్భుతం: కెసిఆర్, ప్రతినిధులందర్నీ..
హైదరాబాద్: సింగపూర్ పర్యటన అద్భుతమైన అనుభూతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఎలా అభివృద్ధి చెందవచ్చో సింగపూర్ నిరూపించిందన్నారు.
ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యమైన అమెరికా సరసన సింగపూర్ నిలిచిందని కెసిఆర్ పేర్కొన్నారు. మంచినీరు సహా ప్రతి వస్తువును దిగుమతి చేసుకుంటున్న సింగపూర్లో ప్రభుత్వ విధానాలు, ప్రజల భాగస్వామ్యం అద్భుతమని చెప్పారు. భూ సమస్యను సింగపూర్ చాలా తెలివిగా పరిష్కరించిందన్నారు.
త్వరలో ప్రజాప్రతినిధులందరినీ సింగపూర్ పంపాలనే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో మన నేతలకు శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధానిని కోరినట్లు ఆయన వెల్లడించారు. సింగపూర్లోని అన్ని రంగాల ప్రగతిపై అధ్యయనం చేశానని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. సింగపూర్ తొలి ప్రధాని లీక్వాన్ యూ రాసిన పుస్తకం తెలుగులోకి అనువదించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సింగపూర్లో కెసిఆర్ తన ఐదు రోజుల అధికారిక పర్యటనను ముగించుకుని ఆదివారం రాత్రి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం సాయంత్రం 6గంటలకు సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో భేటీ కానున్నారు. మెదక్ లోకసభ ఉప ఎన్నిక, పార్టీ తరపున అభ్యర్థిని ఖారారు చేసే విషయంపై చర్చించే అవకాశం ఉంది.