కల్తీ నెయ్యి కేసులో ఏ-1, కీలక ఆధారాలు: అరెస్ట్ లిస్టులో నెక్స్ట్..!!
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదం పై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ విచారణ ప్రారంభించింది. కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్ట్ చేసింది. అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా తీసిన సిట్ ఈ వ్యవహారంలో అసలు బాధ్యలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో, త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
సిట్ తేల్చిందేంటి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణల పైన సిట్ విచారణ లో పలు ఆసక్తి కర అంశాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేసింది. లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు, సరఫరా చేసిన సం స్థల వరకు సిట్ పలు కోణాల్లో విచారణ చేసింది. పలువురిని విచారించింది. రికార్డులను పరిశీలన చేసింది. విచారణ తరువాత ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్(45), పోమిల్ జైన్(47).. వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్(69)ను అరెస్టు చేసింది.

కీలక సమాచారం
కాగా లడ్డూ కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో విపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డెయి రీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం పైన సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ల లాగ్ బుక్కులు, ట్రిప్ షీట్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నుంచి సమాచారం సేకరించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు పొందిన ఏఆర్ డెయిరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ బృందం నిర్ధారించింది. అందులో భాగంగా నాలుగు రోజులుగా ఏఆర్, వైష్ణవి డెయిరీల్లో విచారణ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు.
అదుపులో మరో పది మంది
ఇదే సమయంలో ఈ డెయిరీలకు చెందిన పది మంది సిబ్బంది సిట్ అదుపులోనే ఉన్నట్లు సమా చారం. డెయిరీలకు చెందిన మేనేజర్ల నుంచి అధికారులు, ల్యాబ్ స్టాఫ్, ట్యాంకర్లను డ్రైవర్లుగా పని చేసిన వారు సిట్ అదుపులోనే ఉన్నారు. ఏఆర్, బోలేబాబా, వైష్ణవి డెయిరీల ముఖ్యుల సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. తక్కువ ధరకు నెయ్యి సరఫరా కు అంగీకరించటం తో పాటుగా టీటీడీ అధికారులు ఎవరైనా సహకారం అందించారా.. దీని వెనుక ఎవరి పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఏ-1 ఎవరు
కాగా, ఈ కేసులో ఏ-1 ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. రిమాండ్ రిపోర్టులో రాజు రాజశేఖరన్ను ఏ-2గా, పోమిల్ జైన్ను ఏ-3గా, విపిన్ జైన్ను ఏ-4గా, అపూర్వ చావ్దాను ఏ-5గా పేర్కొన్నా.. ప్రథమ నిందితుడి పేరును ప్రస్తావించ లేదు. అయితే, ఏ-1 గా టీటీడీలో కీలకంగా పని చేసిన మాజీ అధికారి.. లేదా టీటీడీ బోర్డులో పని చేసిన ప్రముఖ వ్యక్తి ఉండే అవకాశం ఉందనే అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, సిట్ తదుపరి చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications