ఏపీలో స్మార్ట్ సబ్స్టేషన్లు: విశాఖజిల్లా గిడిజాల పైలట్ ప్రాజెక్ట్; ఉద్యోగులు లేకుండానే విద్యుత్ సరఫరా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థలో కొత్త ఒరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. స్మార్ట్ సబ్ స్టేషన్ల ద్వారా ఉద్యోగుల అవసరం లేకుండానే విద్యుత్ సరఫరా చేయనుంది. సబ్ స్టేషన్ నుండి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరాను ఆటోమేషన్ సిస్టం ద్వారా అందించనుంది. ఇక విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్ సబ్ స్టేషన్ల ద్వారా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అధికారులకు అందుతుంది.

స్మార్ట్ సబ్ స్టేషన్లు .. విశాఖలోని గిడిజాల సబ్ స్టేషన్ పైలట్ ప్రాజెక్ట్
ఈపీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్న విద్యుత్ శాఖ విశాఖలోని ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్ స్టేషన్ ను తొలిగా పూర్తిస్థాయి ఆటోమేషన్ సబ్ స్టేషన్ గా తీర్చిదిద్దడానికి రంగంలోకి దిగారు. గిడిజాల వద్ద ఉన్న 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రస్తుతం స్మార్ట్ సబ్ స్టేషన్ గా మారనుంది. ఇది సక్సెస్ అయితే ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్ స్టేషన్లను స్మార్ట్ సబ్ స్టేషన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఏపీలో దశల వారీగా సబ్ స్టేషన్ ఆటోమేషన్ సిస్టమ్.. 334.51 కోట్ల అంచనా వ్యయం
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో కార్పొరేషన్ (APTransco) రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా సబ్స్టేషన్ ఆటోమేషన్ సిస్టమ్ (SAS)ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనికోసం 334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇక గిడిజాల సబ్ స్టేషన్ ను స్మార్ట్ స్టేషన్ గా తీర్చిదిద్దడం కోసం 50 లక్షల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని విద్యుత్ శాఖ అంచనా వేసింది. పెదవాల్తేరు సబ్ స్టేషన్ లోని స్కాడ్ కంట్రోల్ రూం నుంచి ఈ స్మార్ట్ సబ్ స్టేషన్ ను ఆపరేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మిగతా సబ్ స్టేషన్లు స్మార్ట్ స్టేషన్లుగా
గిడిజాల సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు అన్నీ ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్ కి చేరనుంది . ఇక ఈ పైలెట్ ప్రాజెక్టు లో వచ్చే ఫలితాలను బట్టి మిగతా సబ్ స్టేషన్లను స్మార్ట్ సబ్ స్టేషన్లు గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. స్మార్ట్ సబ్ స్టేషన్ల ద్వారా ఉద్యోగుల అవసరాన్ని తగ్గించి, విద్యుత్ సరఫరాలో సమస్యలైనా, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైనా వెంటనే తెలిసేలా రిమోట్ విధానంలో నిర్వహించే వీలు కలుగుతుంది.
Recommended Video

దేశ వ్యాప్తంగానూ పూర్తి ఆటోమేటెడ్ సబ్స్టేషన్లు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) దేశవ్యాప్తంగా పూర్తి ఆటోమేటెడ్ సబ్స్టేషన్లను నిర్వహిస్తోంది. ఇది విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ, ప్రసార నష్టాలను తగ్గించగలదని మరియు పంపిణీ నెట్వర్క్లో పెట్టుబడిని తగ్గించడంలో సహాయపడుతుందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. సబ్స్టేషన్ ఆటోమేషన్ అనేది సర్క్యూట్ బ్రేకర్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిలేలు వంటి స్మార్ట్ ఎలక్ట్రికల్ పరికరాల ఏకీకరణ, ఇది వాటి కార్యాచరణను పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సబ్స్టేషన్, ఫీడర్ ఆపరేటింగ్ ఫంక్షన్లు మరియు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సిస్టమ్ మరియు అలారం ప్రాసెసింగ్ నుండి అప్లికేషన్ల విస్తరణ ఉంటుంది. ఇది ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం లేకుండా ఆపరేషన్ మరియు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications