టార్గెట్ సోము వీర్రాజు - ఢిల్లీ నేతలకు ఫిర్యాదులు: వెనుక ఉన్నదెవరు..!!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును టార్గెట్ చేస్తోందెవరు. సొంత పార్టీ నేతలే సోము వీర్రాజును డామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారనే వాదనలు బీజేపీలో వినిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని విశాఖ పర్యటన వేళ.. వీర్రాజును ప్రధాని మీరెవరో ముందుగా పరిచయం చేసుకోండని కోరారంటూ పత్రికల్లో వచ్చిన లీకుల పైన ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది. దీని పైన సోము వీర్రాజు మద్దతు దారులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఈ రకమైన వార్తల పైన అటు ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా పని చేసి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేత కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
అదే సమయంలో సోము వీర్రాజు కాలోజీ కవితను గుర్తు చేస్తూ ట్వీట్ ద్వారా తాను చెప్పదలచుకున్నది చెప్పారు. ప్రధాని సమక్షంలో జరిగిన సమావేశంలో అంశాల పైన వచ్చిన వార్తలు..ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న ప్రచారంగా వీర్రాజు వర్గం భావిస్తోంది. దీని పైన ఢిల్లీలోని పార్టీ కీలక నేతలకు ఫిర్యాదులు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలో ప్రధాని పర్యటన అంశం పైన ఏపీ బీజేపీ కోర్ కమిటీలోని కొందరు సభ్యులు సోము వీర్రాజు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
పార్టీ పరంగా ఏర్పాట్లు చేయకుండా, ఏపీ ప్రభుత్వం సభా నిర్వహణ బాధ్యతలు తీసుకోవటం ఏంటని నేతలు సోము వీర్రాజును నిలదీసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక, పవన్ కల్యాణ్ బీజేపీ తాను కోరిన విధంగా రూట్ మ్యాప్ ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన తరువాత పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత చీఫ్ వీర్రాజు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ ను సమన్వయం చేసుకోలేని కారణంగానే పవన్ బీజేపీకి దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటూ కొందరు బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు.
అయితే, ప్రధాని విశాఖ పర్యటనలో ప్రధానంగా పవన్ కల్యాణ్ తో భేటీ ద్వారా బీజేపీ - జనసేన మధ్య గ్యాప్ ను దాదాపుగా భర్తీ చేసారు. ఒక, పొత్తుల విషయం మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో, టీడీపీతో ఏ రకంగా వ్యవహరించనున్నారనేది ఆసక్తి కర అంశంగా మారుతోంది. దీంతో, ఇప్పుడు సొంత పార్టీలో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఉన్న నేతల తీరు పైన రాజకీయంగా చర్చ మొదలైంది. దీని పైన ఢిల్లీ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.