వ్యాఖ్యలు వాస్తవం: కిరణ్ రెడ్డికి టిడిపి నేత బాసట
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఆయన కోరారు. కిరణ్ రెడ్డి చెబుతున్న కష్టాలన్నీ 2009 నుంచి తమ పార్టీ చెబుతూనే ఉన్నదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన రద్దయినట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఢిల్లీ పరిణామాల దృష్ట్యా అందుబాటులో ఉండలేనని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిచ్చాసుపత్రికి పంపించాలని సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. గత 56 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ఆయన శనివారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో మీడియాతో అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి వెనక నుంచి నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్రలో అభద్రతా భావాన్ని తొలగించాల్సిన ముఖ్యమంత్రే అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానాన్ని కూడా ధిక్కరించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ నల్లగొండలో అన్నారు. సాగునీటి విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రి అవి ఏమీ తెలియనట్లు కాకి లెక్కలు చెబుతున్నారని ఆయన అన్నారు. అసమర్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళ పరిస్తితి ఏర్పడిందని ఆయన అన్నారు.