రోజాపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని సోమిరెడ్డి
హైదరాబాద్ : వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజాను పదవి కాలం మొత్తం శాసనసభ నుంచి బహిష్కరించాలని చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు.
రోజా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతోందని, ఆమె వాడుతున్న భాష వల్ల రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, మహిళలు రోజాకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. బజారు రౌడీలు కూడా అలా మాట్లాడరని, ప్రజాప్రతినధి అయిన రోజా మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేవిధంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు.
ఆమె వాడిన మాటలు మనం మాట్లాడలేమని సోమిరెడ్డి అన్నారు. రోజాకు ఏడాది బహిష్కరించినా బుద్ధిరాలేదని, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమెను ఐదేళ్లపాటు అసెంబ్లీకి రాకుండా బహిష్కరించాలని సోమిరెడ్డి అన్నారు. మహిళలే తగిన రీతిలో రోజాకు బుద్ది చెప్పాలని మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు.
ముద్రగడ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు: రామానుజయ
కాపుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డైరెక్టన్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.