చంద్రబాబుకు మరో గుడ్ న్యూస్-మెత్తబడుతున్న బీజేపీ ? విజనరీ అంటూ సోము వీర్రాజు పొగడ్తలు..
ఏపీలో గతంలో రెండుసార్లు బీజేపీతో స్నేహం చేసి ఆ తర్వాత బద్ధవిరోధిగా మారిపోయిన చంద్రబాబుకు మళ్లీ కాషాయ స్నేహం చేసే అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో మారుతున్న పరిస్ధితుల్లో నానాటికీ బలపడుతున్న బీజేపీ ఏపీలో ఉనికి చాటుకోవాలంటే వైఎస్ జగన్ కంటే చంద్రబాబుతో పొత్తే బెటరన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబును దూరం పెడుతున్న బీజేపీ.. తాజాగా మాత్రం మరోసారి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు-బీజేపీ స్నేహం
ఏపీలో గత రెండు దశాబ్దాల్లో చూస్తే టీడీపీ సాయంతోనే బీజేపీ తన ఉనికి చాటుకోగలిగింది. కాంగ్రెస్ తో బీజేపీకి ఎలాగో పడదు. అలాగే వైసీపీతో కూడా పొసగదు. అయినా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి మొహమాటపు స్నేహం కూడా తప్పదు. కానీ వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు లేవు. దీంతో మళ్లీ తిరిగి బీజేపీ చంద్రబాబును ఆదరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమతో విభేధించి మోడీ-షాలపైనే ధర్మపోరాటం చేసిన చంద్రబాబుకు కాషాయ శిబిరం మరో అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది.
భీమవరంతో మారిన సీన్
ప్రధాని మోడీ భీమవరం టూర్ కు వచ్చిన సందర్భంగా టీడీపీకి ఆహ్వానం లభించింది. అయితే చంద్రబాబుకు నేరుగా మాత్రం కాదు. దీంతో అక్కడికి వెళ్లిన టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మాత్రం అనుమతించలేదు. దీంతో కిషన్ రెడ్డి నేరుగా సారీ చెప్పేశారు. అదే సభకు కచ్చితంగా రావాల్సిన పవన్ కళ్యాణ్ మాత్రం పలు కారణాలతో అక్కడికి వెళ్లలేదు. దీంతో ఈ వ్యవహారంపై దృష్టిపెట్టిన బీజేపీ.. ఓవైపు పవన్ చేజారకుండా చూసుకుంటూనే మరోవైపు టీడీపీని అక్కున చేర్చుకునేందుకు సిద్దమవుతున్న సంకేతాలు ఇస్తోంది.
చంద్రబాబుకు ఢిల్లీ ఆహ్వానం
గతంలో చంద్రబాబు ఢిల్లీ వచ్చి కలుస్తానని బతిమాలుకున్నా అపాయింట్ మెంట్లు ఇవ్వని మోడీ-అమిత్ షా ద్వయం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో చంద్రబాబును ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేరుగా చంద్రబాబుకే ఆహ్వానం రావడంతో మోడీతో చాన్నాళ్ల తర్వాత ఒకే వేదికపై ఆయన దర్శనమివ్వబోతున్నారు. దీంతో చంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఆ వేదికపై మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు విజనరీ, జగన్ కాదన్న సోము వీర్రాజు..
తాజాగా విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు దార్శనికుడు కాబట్టే అప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతికి రూ. 8500 కోట్లు నిధులిచ్చేందుకు సిద్ధపడిందని, అదే జగన్ దార్శనికుడు కాదు కాబట్టే ఆయనకు మూడు రాజధానులకు నిధులివ్వడం లేదని సోము వ్యాఖ్యానించారు.
బీజేపీతో చంద్రబాబు స్నేహం చెడిన తర్వాత ఆ పార్టీ నేతల నుంచి చంద్రబాబుకు దక్కిన కీలక ప్రశంస ఇది. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోతున్నారు. ఓవైపు ఢిల్లీకి చంద్రబాబుకు ఆహ్వానం, మరోవైపు సోము ప్రశంసలు చూస్తుంటే ఏపీలో ఏం జరగబోతోందనేది సాధారణ ప్రజలకు సైతం అర్ధమవుతోంది.