అమరావతి రైతులను రోడ్డున పడేసింది చంద్రబాబే - రూటు మార్చిన బీజేపీ..!!
గుంటూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర సాగిస్తోన్నారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, తక్షణమే నిర్మాణం చేపట్టాలనేది వారి ప్రధాన డిమాండ్లు. ఈ పాదయాత్ర ఇవ్వాళ 14వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఈ పాదయాత్ర సాగుతోంది.
రూటు మార్చిన బీజేపీ..
తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలు 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా రైతులు పాదయాత్రకు దిగారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. చంద్రబాబు నాయుడు నిధులను సమకూర్చుతున్నారంటూ ఇదివరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ నిరసనల కోసం ఆయన ఇదివరకు జోలె పట్టిన సందర్భాలను కూడా ఇందుకు ఉదహరిస్తోన్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ కూడా అదే తరహా ఆరోపణలు సంధించింది.
రోడ్డెక్కించింది చంద్రబాబే..
అమరావతి ప్రాంత రైతులను చంద్రబాబే రోడ్డెక్కించారని, వారిని నడిపిస్తోన్నారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యమంత్రిగా అయిదు సంవత్సరాలు చంద్రబాబు పని చేసినప్పటికీ.. అమరావతిని పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ఆయన ప్రభుత్వ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని అన్నారు.
6,500 కోట్లు ఏం చేశారు?
ప్రజాపోరులో భాగంగా గుంటూరు లాడ్జి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి నిర్మాణం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇందులో 2,500 కోట్ల రూపాయలను ఒకేదఫాలో విడుదలయ్యాయని చెప్పారు. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఇచ్చినప్పటికీ.. రాజధాని కట్టకుండా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.
ఏ దేశానికి వెళ్తే ఆ దేశం పేరుతో
రాజధాని కట్టకపోవడం వల్ల అమరావతి ప్రాంత రైతులందరూ ఇవ్వాళ రోడ్డెక్కారని ధ్వజమెత్తారు. వారందరినీ నడిపించేదెవరని, దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. 6,500 కోట్ల రూపాయలను చంద్రబాబుకు ఇస్తే- ఆ నిధులతో రాజధానిని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సింగపూర్, జపాన్, మలేసియా అంటూ ఏ దేశానికి వెళ్తే- ఆ దేశం పేరు చెప్పుకొంటూ అయిదేళ్ల విలువైన కాలాన్ని చంద్రబాబు నాశనం చేశాడని, ప్రజలను గ్రాఫిక్స్ బొమ్మలతో మభ్యపెట్టారని, భ్రమల్లో ముంచారని ఆరోపించారు.
1,800 కోట్లతో ఎయిమ్స్..
అన్ని దేశాలు తిరిగినా.. రాజధాని కట్టలేదని ఎద్దేవా చేశారు. 6,500 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయిపోయానని సోము వీర్రాజు చెప్పారు. 1,800 కోట్ల రూపాయలతో మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ను నిర్మించిందని గుర్తు చేశారు. చంద్రబాబు కట్టని అమరావతి బాగుందా.. తాము కట్టిన ఎయిమ్స్ బాగుందా? అని స్థానికులను ప్రశ్నించారు. ఒక్కసారి ఎయిమ్స్ను చూస్తే కేంద్రంలోని తమ ప్రభుత్వం దాన్ని ఎంత అద్భుతంగా కట్టిందో అర్థమౌతుందని అన్నారు.