విభజన: సోనియాపై జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతా సోనియమ్మ మాటేనని, అమ్మ ఏది అంటే అదేనని ఆయన అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గానీ రాయల తెలంగాణ గానీ సోనియమ్మ ఒకే అంటేనని ఆయన అన్నారు. అమ్మ మాటకు చట్టం లేదు, న్యాయం లేదని ఆయన వ్యాఖ్యానించారు.అమ్మ చెప్తే హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదని, అమ్మ చెప్పిన రాజధానికి వెళ్లి పోవాల్సిందేనని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలో నిబంధనలన్నింటినీ పక్కన పెట్టారని, అంతా అమ్మ(కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ) చెప్పినట్టే జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ విషయంలో అమ్మ ఏం చెబితే అదే ఖరారు చేస్తారని అన్నారు. సోనియా గాంధీ ఆదేశాలతోనే విభజన జరుగుతోందని ఆయన తెలిపారు.
అమ్మ చెప్పింది ఆచరించడమేనని, ఆమె చెప్పిందే శిరోధార్యమని ఆయన అన్నారు. హైదరాబాద్ సీమాంధ్ర ప్రజలది కాదని చెప్పినప్పుడు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని జెసి చెప్పారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్ల సీమాంధ్ర ప్రజలకు ఒరిగేదిమి లేదని దివాకర్ రెడ్డి అన్నారు.
విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందేనని తెలిపారు. రాయలతెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన తర్వాత రాయలతెలంగాణపై చర్చిస్తానని చెప్పారు.