మారుమూలన ఉన్న సాలూరుపై నరేంద్రమోడీ వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి వేగంగా జరగాలంటే రవాణా సదుపాయం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగా కొన్ని ప్రాంతాలకు రైలు సేవలను పునరుద్ధరించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాశారు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సాలూరు వరకు నడవబోతున్న మెము
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన సాలూరుకు విశాఖపట్నం నుంచి మెము రైలును నడిపించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం మధ్య నడుస్తున్న మెము రైలును సాలూరు వరకు పొడిగించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే బ్రిటీష్ అధికారులు ఇక్కడ రైల్వేస్టేషన్ ను ఏర్పాటు చేశారు. స్టేషన్ నుంచి ఆదాయం లేకపోవడంతో రెండువేల సంవత్సరంలో దీన్ని మూసేశారు. సాలూరు నుంచి గోధుమలు, సిమెంటు, తదితరాలు ఒడిసాకు, మధ్యప్రదేశ్ కు రవాణా అయ్యేవి.

ఒక బోగీతో అయినా నడిపించాలంటూ పోరాటం
హఠాత్తుగా రైలును రద్దుచేయడంతో కనీసం ఒక బోగీతో అయినా నడపాలంటూ స్థానికులు పోరాటం చేయడంతో రైలుబస్సును సాలూరు-బొబ్బిలి మధ్య 2004లో తీసుకువచ్చారు. సాలూరు, బొబ్బిలి పట్టాణాలకు చెందిన ప్రజలతోపాటు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. దీనితర్వాత సాలూరు నుంచి పార్వతీపురం, రాయగఢ మీదుగా విజయవాడ వరకు సేవలు పొడిగించాలని స్థానికులు కోరారు. దీంతో దండిగాం వరకు 2017లో సేవలను పొడిగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో ట్రాక్, స్టేషన్ పాడయ్యాయి.
మరమ్మతులు చేపట్టినా రైలు మాత్రం ఇక్కడికి రాలేదు. తాజాగా రైల్వేబోర్డు అనుమతి రావడంతో ఈ రైలు అందుబాటులోకి వస్తోంది. సాలూరు నుంచి విశాఖపట్నం వరకు చేరుకుంటే అక్కడి నుంచి రాజధాని అమరావతి చేరుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు నడవడం ప్రారంభమైన తర్వాత సాలూరు నుంచి నేరుగా విజయవాడకు రైలు నడిపేలా పోరాటం చేస్తామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications